వైసీపీ అధ్యక్షుడు జగన్ నిన్న విజయవాడలో నేడు గుంటూరులో పరామర్శ యాత్రల పేరుతో చేసిన హడావుడి, మాట్లాడిన మాటలపై టీడీపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడలో అల్లర్లు సృష్టించాలనే పెద్ద ప్లాన్తోనే జగన్ వందల మందిని వెంటేసుకు వచ్చారని, కానీ సాధ్యం కాకపోవడంతో నేడు గుంటూరులో మళ్ళీ ప్రయత్నించారని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు.
జగన్ తీరు, మాటలు వింటున్నప్పుడు ఆయన మానసిక పరిస్థితి బాగోలేదేమోనని అనుమానం కలుగుతోందన్నారు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. రాష్ట్రానికి 5 ఏళ్ళు ముఖ్యమంత్రి పని చేసిన జగన్, పోలీసుల బట్టలు ఊడదీసి కొడతానని బెదిరించడం గమనిస్తే ఎన్నికలలో ఓడిపోయినా ఆయన నోరు, తీరు మారలేదని స్పష్టమయ్యిందన్నారు.
జగన్ ధోరణి నచ్చకనే ప్రజలు 11 సీట్లతో సరిపెట్టారని, కానీ జగన్ ఇంకా ఇలాగే ప్రవర్తిస్తుంటే వచ్చే ఎన్నికలలో 11లో ఒకటి తీసేసి ఒక్క సీటు మాత్రమే ఇస్తారని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.
వ్యవసాయ శాఖ మంత్రి అచ్చన్నాయుడు కూడా జగన్ మానసిక పరిస్థితిపై అనుమానం వ్యక్తం చేస్తూ, అధికారంలో ఉన్న 5 ఏళ్ళలో బటన్ నొక్కడానికి తప్పితే ఎన్నడూ ప్యాలస్లో నుంచి బయటకు రాలేదు. ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ప్యాలస్లో నుంచి బయటకు రావడం లేదు. బయటకు వస్తే ఈవిదంగా పిచ్చిపిచ్చిగా ఏదేదో మాట్లాడుతుంటారు.
జగన్ అన్ని రంగాలతో పాటు వ్యవసాయ రంగాన్ని కూడా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు రైతుల కోసం మొసలి కన్నీరు కార్చుతున్నారు. ముఖ్యమంత్రిగా చేసిన జగన్ మిర్చి ధరల హెచ్చు తగ్గులు ఏవిదంగా ఉంటాయో తెలుసుకోకుండా నోటికి వచ్చిన్నట్లు మాట్లాడారు,” అని మంత్రి అచ్చన్నాయుడు ఆక్షేపించారు.
రాష్ట్ర విభజనతో పరిశ్రమలు, ఐటి కంపెనీలు అన్నీ హైదరాబాద్కు దక్కడంతో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మారింది. కనుక అప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు, అటు పరిశ్రమలు, ఐటి కంపెనీలను రప్పించేందుకు కృషి చేస్తూనే, వ్యవసాయాభివృద్ధి కోసం పోలవరంతో సహా రాష్ట్రంలో పలు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు వేగవంతం చేశారు.
కానీ జగన్ రాగానే రివర్స్ గేర్ పాలన మొదలుపెట్టడంతో 5 ఏళ్ళ పాలనలో వ్యవసాయంతో సహా అన్ని రంగాలు భ్రష్టు పట్టించేశారు.
నేడు మిర్చీ రైతుల కోసం మొసలి కన్నీళ్ళు కార్చుతున్న జగన్ అధికారంలో ఉన్నప్పుడు వారి కోసం ఏం చేశారు? అనే టీడీపీ నేతల ప్రశ్నలకు జగన్ జవాబు చెప్పలేరు. అయినా కూటమి ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారు.
నిజానికి సిఎం చంద్రబాబు నాయుడుని, కూటమి ప్రభుత్వాన్ని ఏదో పేరుతో విమర్శించాలని, నగరంలో అల్లర్లు సృష్టించాలనే దురాలోచనతోనే జగన్ గుంటూరు మిర్చీ యార్డుకి బయలుదేరారు తప్ప మిర్చీ రైతులపై ప్రేమతో కానేకాదు. ఈ పర్యటనలో జగన్ మాట్లాడిన మాటలే ఇందుకు నిదర్శనం… కాదా?




