కేంద్ర బడ్జెట్లో ఏపీ రాజధాని అమరావతికి రూ.15,000 కోట్లు లభించాయి. పోలవరం పూర్తి చేసే బాధ్యత తమదే అని కేంద్రం ప్రకటించింది. అలాగే రైల్వే బడ్జెట్లో కూడా ఏపీకి రూ.9,151 కోట్లు లభించాయి. ఇంకా జాతీయ రహదారులు, పెండింగ్ ప్రాజెక్టులకు కూడా కేంద్రం సహాయసహకారాలు అందించబోతోంది.
జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తున్నప్పుడే ఇవ్వన్నీ కేంద్రం ప్రకటించింది. కనుక జగన్కు చంద్రబాబు నాయుడిపై ఎంత పగ, ద్వేషం ఉన్నప్పటికీ, కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు కేటాయిస్తే అందుకు సంతోషం వ్యక్తం చేయాలి. వీలైతే ఏపీకి ఇంకా ఏమేమి అవసరమో వివరించవచ్చు.
కానీ చంద్రబాబు నాయుడుపై ద్వేషంతో ఏపీకి బడ్జెట్ కేటాయింపుల గురించి ఒక్క ముక్క మాట్లాడలేదు. కానీ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ ఫోటో ఎగ్జిబిషన్ పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు తీశారు. జగన్ ఎంతసేపు రాజకీయ వ్యూహాలు, ప్రతీకారాల గురించే ఆలోచిస్తున్నారు తప్ప తాను మాజీ ముఖ్యమంత్రినని, తన రాష్ట్రం గురించి ఢిల్లీలో జాతీయ, అంతర్జాతీయ మీడియా ముందు దుష్ప్రచారం చేస్తే రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు పెట్టుబడులు రాకుండా పోతే నష్టం జరుగుతుందని ఆలోచించలేదు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ధర్నా చేస్తున్నప్పుడు కనీసం అదైనా నిజాయితీగా చేయాలి. కానీ ధర్నా పేరుతో ఇండియా కూటమి నేతల ద్వారా కాంగ్రెస్తో జతకట్టడానికి రాయబారాలు చేశారు.
తెలంగాణలో కేసీఆర్ తీరు కూడా ఇలాగే ఉండటం విశేషం. ఆయన కూతురు కవితని విడిపించుకోవడం కోసం బీజేపీతో తెర వెనుక మంతనాలు జరుపుతున్నారు.
కనుక నిన్న శాసనసభకు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తప్పులు పట్టారు. రాష్ట్ర బడ్జెట్ని శాసనసభలో చీల్చి చెండాడేస్తామని చెప్పారు కానీ కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఒక్క ముక్క మాట్లాడలేదు. అందుకే సభలో సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “ఢిల్లీలో చీకటి ఒప్పందాలు చేసుకొని వచ్చిన మీరా మాకు పాఠాలు చెప్పేది?” అంటూ కేటీఆర్ని నిలదీశారు.
ఇక్కడ జగన్ కేంద్ర బడ్జెట్లో ఏపీకి నిధులు కేటాయింపుని మెచ్చుకోలేరు. అక్కడ కేసీఆర్ బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగితే ఖండించలేరు. దొందూ దొందే కదా?




