అవును ఆంద్రాకి అన్నీ ఉన్నాయి కానీ….

Buggana_Rajendranath_Reddyఏపీ ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలని ఆకర్షించేందుకు శుక్రవారం చెన్నైలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. అంతకు ముందు బెంగళూరు సదస్సులో పాల్గొన్నప్పుడు “మూడు రాజధానులు ఓ మిస్ కమ్యూనికేషన్… ఏపీకి ఒకటే రాజధాని ఉంటుంది. అది విశాఖపట్నం మాత్రమే” అంటూ చేసిన వ్యాఖ్యలు జగన్‌ ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరంగా మారడంతో, చెన్నైలో మాట మార్చి ఏపీ చరిత్ర పాఠాలు వినిపించి తమ ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉందని చెప్పుకొచ్చారు.

అయితే వైసీపీ మనసులో ఏముందో బయటపెట్టేసిన తర్వాత ఇప్పుడు ఎంత సమర్ధించుకొన్నా ప్రజలు, పెట్టుబడిదారులు నమ్మరు. ఈ సందర్భంగా ఆయన పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పొడవాటి తీర ప్రాంతం ఉందని, కనుక నౌకాశ్రయాలు, చేపలు, రొయ్యలసాగు, ఆక్వా ఎగుమతులకి మంచి అవకాశం ఉంటుందని మంత్రి బుగ్గన వివరించారు.

ADVERTISEMENT

మంత్రి బుగ్గన చెప్పింది అక్షరాల నిజమే. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌ చాలా నష్టపోయినప్పటికీ రాష్ట్రంలో సహజవనరులని, మానవ వనరులని వినియోగించుకోగలిగితే శరవేగంగా కోలుకోగలిగేది. రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ఆ దిశలో గట్టి ప్రయత్నాలు చేశారు. కానీ అవి ఫలించేలోగా ప్రభుత్వం మారడం, దాంతో పాటు ప్రభుత్వ ప్రాధాన్యతలు మారడంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిపోయి అప్పులలో అగ్రస్థానంలో నిలిచింది.

ఆంధ్రప్రదేశ్‌ విడిపోకమునుపే రాష్ట్రంలో నౌకాశ్రయాలున్నాయి. ఈ 8 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రంలో నేటికీ ఒకే ఒక్క విమానాశ్రయం ఉండగా, ఏపీలో ఎప్పటినుంచో నాలుగు విమానాశ్రాయలున్నాయి. కడపతో కలిపి అవిప్పుడు ఐదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎప్పుడూ ఆక్వా రంగంలో అగ్రగామిగానే ఉంది.

అలాగే రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా తిరుపతి, శ్రీకాళహస్తి, బెజవాడ కనకదుర్గమ్మ, ద్రాక్షారామం, అన్నావరం, సింహాచలం, అరసవెల్లి, శ్రీకూర్మం వంటి అనేక పుణ్యక్షేత్రాలు ఏపీలోనే ఉన్నాయి. వాటితో పాటు చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు అనేకానేక పర్యాటక ఆకర్షణ కేంద్రాలు కోకొల్లలుగా ఉన్నాయి.

ఇక రవాణా రంగంలో ఏపీ అగ్రగామిగానే ఉంది. రాయలసీమ తప్ప మిగిలిన ప్రాంతాలలో మంచి సాగునీటి వసతి ఉన్నందున ఏడాదికి మూడు పంటలు పండుతుంటాయి. వరి, చెరుకు, మొక్కజొన్న విస్తారంగా పండిస్తుంటారు. రాష్ట్రంలో మామిడిపళ్లకి ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఉంది. రాష్ట్రంలో బలమైన పాడిపరిశ్రమ కూడా ఉంది. విశాఖలో ఐ‌టి కంపెనీలు ఉండేవి. గ్రానైట్, సిమెంట్, స్టీల్ కంపెనీలున్నాయి. విద్యారంగంలో కూడా ఏపీదే పైచేయిగా ఉంది.

ఇలా చెప్పుకొంటూ పోతే ఇంకా చాలానే ఉన్నాయి. అయినా వైసీపీ ప్రభుత్వం వాటిని ఆదాయవనరులుగా మార్చుకోలేదు. అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి అంటే సంక్షేమ పధకాలే అని వితండవాదం చేస్తూ వాటికోసం ఎడాపెడా అప్పులు చేస్తూ పోయింది తప్ప చేతిలో ఉన్న ఈ ఆదాయ వనరులని కనీసం గుర్తించనేలేదు.

కనీసం అమరావతి నిర్మాణపనులు కొనసాగించినా రాష్ట్రానికి ఓ గుర్తింపు, పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చి ఉండేవి. కానీ మూడున్నరేళ్ళుగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతూ కాలక్షేపం చేసేసి, ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుంటే మంత్రి బుగ్గన పెట్టుబడులు, పరిశ్రమలు అంటూ తిరుగుతున్నారు.

రాష్ట్రంలో అన్ని ఉన్నా ఎందుకు పెట్టుబడులు, పరిశ్రమలు, రావడం లేదు? అంటే వారికి నమ్మకం కల్పించలేకపోవడమే. మూడు రాజధానుల విషయంలో మంత్రి బుగ్గన బెంగళూరులో మాట్లాడిన మాటలకి పూర్తి భిన్నంగా చెన్నైలో మాట్లాడటమే ఇందుకు నిదర్శనం. కనుక ఏపీకి అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు అభివృద్ధి చెందలేకపోతోంది. మంత్రి బుగ్గన సదస్సులో ఎన్ని చరిత్ర పాఠాలు, పిట్ట కధలు చెప్పినప్పటికీ తమ ప్రభుత్వ చిత్రవిచిత్రమైన ఆలోచనలు, విధానాలు, రాజకీయ కక్ష సాధింపులు, రాష్ట్రంలో రాజకీయ అస్థిరత వంటివి పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు గమనించలేరని అనుకోవడం పిల్లి కళ్ళు మూసుకొని పాలు త్రాగడమే అవుతుంది.

ADVERTISEMENT
Latest Stories