ఆదివారం నాడు జరిగిన ఏపీ క్యాబినెట్ విస్తరణ, ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ నేతల చర్యలను గుర్తుకు తీసుకురావడంతో, కలత చెందిన చంద్రబాబు పార్టీ నేతలకు క్లాస్ పీకారు. తెలుగుదేశం పార్టీ నియమావళిని, క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ, ఇష్టానుసారం ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకునేది లేదని చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అందరి లక్ష్యం 2019 ఎన్నికలేనని, రెండేళ్ల తరువాత గెలుపే లక్ష్యంగా, సామాజిక న్యాయం, ప్రాంతీయ సమతుల్యం పాటిస్తూ క్యాబినెట్ విస్తరణ జరిగిందని తెలిపారు.
ఎవరికి పదవులు ఇచ్చినా విస్తృతంగా చర్చించే నిర్ణయం తీసుకున్నామని, అయితే ఈ విస్తరణపై కొందరు శృతిమించి ప్రవర్తించడం తనకు బాధను కలిగించిందని, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సోమవారం నాడు ఉదయం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏదైనా ఉంటే తనతో నేరుగా చెప్పాలే తప్ప, మీడియాకు ఎక్కితే చూస్తూ ఊరుకోబోనని కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని, పార్టీకి మంచి పేరు తేవాలని హితవు పలికారు.
అయితే, తెలుగుదేశం పార్టీ నేతల్లో చాలా మందికి మంత్రి పదవులు నిర్వహించే సత్తా, అనుభవం ఉన్నా అందరికీ పదవులు ఇవ్వలేకపోయానని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు. 26 మందికి మించి మంత్రివర్గంలో స్థానం కల్పించే పరిస్థితి లేదని, కొందరికి మంత్రి పదవులు చేపట్టేందుకు అర్హత ఉన్నా సంఖ్యా పరిమితి అడ్డుగా నిలిచిందని, అసంతృప్తులను అనునయించే ప్రయత్నం చేశారు. ప్రజలు బాగుండాలంటే, పార్టీ కూడా బాగుండాలన్న విషయాన్ని నాయకులు అర్థం చేసుకుని ప్రవర్తించాలని హితవు పలుకుతూ బుజ్జగించారు.



