ఈ నష్టాలను కాగ్ కూడా లెక్క కట్టలేదేమో?

Amaravati Andhra Pradesh

జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళలో మూడు రాజధానులు కాదు కదా ఆయన కోరుకున్నట్లుగా ఒక్క రాజధాని కూడా ఏర్పాటు చేయలేకపోయారు. అందువల్ల గత 5 ఏళ్ళలో ఎన్ని పరిశ్రమలు ఇరుగు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయో లెక్కేలేదు. ఆవిదంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయడం ఎవరివల్లా సాధ్యం కాదు.

అమరావతిని రాజధానిగా వద్దనుకుంటే దానిని పాడుబెట్టనవసరం లేదు. వివిద దశలలో ఉన్న భవన సముదాయాల నిర్మాణ పనులను పూర్తిచేసి ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడుపై ద్వేషంతో వేలకోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఆ భవనాలు, వాటి కోసం నిర్మించిన పునాదులు, వేసిన రోడ్లు అన్నిటినీ జగన్‌ నిర్ధాక్షిణ్యంగా పాడుబెట్టేశారు.

ADVERTISEMENT

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతిలో పేరుకుపోయిన చెత్త, ముళ్ళ కంపలు తొలగిస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌‌ రాష్ట్రానికి, ప్రజలకు గర్వకారణంగా నిలవాల్సిన 47 అంతస్తుల ఐకాన్ టవర్స్ పునాదుల చుట్టూ నిలిచిన నీటిని పంపులతో తోడి బయట పోస్తూనే ఉన్నారు.

దాదాపు 6 నెలలు కష్టపడితే ఇప్పటికీ అమరావతి శుభ్రపడింది. ఐకాన్ టవర్స్ కోసం వేసిన పునాదులు బయటకు కనిపిస్తున్నాయి. జగన్‌ నిర్వాకం వల్లనే దీని కోసం ప్రభుత్వం ఇంత శ్రమ, ఇంత ఖర్చు పెట్టాల్సి వచ్చిందని వేరే చెప్పక్కరలేదు.

ఓ అపార్ట్‌మెంట్‌ నిర్మాణం ఆలస్యం అయితే, నానాటికీ పెరుగుతున్న సిమెంట్, స్టీల్ ధరల వలన దాని వ్యయం కూడా భారీగా పెరిగిపోతుంటుంది. అలాంటిది… 5 ఏళ్ళుగా అమరావతిలో నిర్మాణ పనులన్నీ నిలిపివేస్తే?

అమరావతిలో 5 టవర్ల నిర్మాణానికి 2018లో రూ.2,703 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. కానీ ఇప్పుడు వాటి నిర్మాణానికి రూ. 4,687 కోట్లు ఖర్చు అవుతుందని తాజా అంచనా. అంటే జగన్‌ నిర్వాకం వలన రాష్ట్రానికి మరో రూ.1,994 కోట్లు నష్టం జరిగిందన్న మాట!

ఈ నిర్వాకం అంతా సరిపోదన్నట్లు, అమరావతికి రూ.15,000 కోట్లు రుణం మంజూరు చేసిన ప్రపంచ బ్యాంకుకి కొందరు పిర్యాదులు చేస్తున్నారు. ఆ కొందరు ఎవరో ఊహించుకోవచ్చు.

అమరావతి కోసం చట్ట ప్రకారం భూసేకరణ చేయలేదని, రైతులకు పునరావాసం, నష్ట పరిహారం చెల్లించలేదని, అమరావతి వరద ముంపు ప్రాంతంలో ఉందని ఆ పిర్యాదుల సారాంశం.

దీంతో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు ఆరాలు తీస్తుండటంతో కూటమి ప్రభుత్వం వారికి పదేపదే వివరణలు ఇచ్చుకొని నచ్చజెప్పుకోవలసి వస్తోంది.

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఏ వ్యక్తీ కూడా తన రాష్ట్రాన్ని , రాజధానిని ఇంతగా నష్టపరుచుకోవాలని అనుకోడు. కానీ జగన్‌ అనుకోవడమే కాకుండా ఇంత దారుణంగా దెబ్బ తీశారు. పైగా నేటికీ అమరావతికి వ్యతిరేకంగా ప్రపంచ బ్యాంకుకి పిర్యాదులు చేయడాన్ని ఏమనుకోవాలి?

ADVERTISEMENT
Latest Stories