
వరంగల్ జిల్లా ఎల్కతుర్తి బిఆర్ఎస్ రజతోత్సవ సభతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఏడాదిన్నర రాజకీయ అజ్ఞాతవాసం ముగించుకుని ఎట్టకేలకు ప్రజల మధ్యకు వచ్చారు.
Also Read – వచ్చే ఎన్నికల నాటికి వైసీపీలో ఎంతమంది ఉంటారో?
అయితే ఇన్నాళ్ల తన ఫామ్ హౌస్ వనవాసాన్ని వీడి కేసీఆర్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి భారీ బహిరంగ సభలో ప్రసంగించడం ఇదే తొలిసారి కావడంతో ఇటు బిఆర్ఎస్ నేతలతో పాటుగా అటు అధికార పార్టీ నాయకులు కూడా కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు అంటూ ఆసక్తిగా గమనించారు.
ఇటు పార్టీ శ్రేణుల ఆకాంక్షలకు తగ్గట్టుగా అటు అధికార పార్టీ ని ఇరుకున పెట్టేలా కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరును ఎండగట్టడం తో పాటుగా పోలీస్ అధికారులకు కూడా వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే అంటూ గట్టి హెచ్చరికలు పంపారు. అలాగే తమ తొలి రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీనే అంటూ కుండబద్దలు కొట్టారు.
Also Read – మోడీ మమ్మల్ని రెచ్చగొడుతున్నారు గానీ…
కొత్త ప్రభుత్వానికి కాస్త సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంతకాలం మౌనంగా ఉన్నాం, కానీ ఇక నుంచి నేను కూడా ఊరుకోను, బయటకు వస్తాను, యందాకైనా మంచిదే, ఎవడి సంగతేంటో, ఎవడి లెక్కలేంటో తేలుద్దాం అంటూ అధికార పక్ష నేతలకు తనదైన స్టైల్ ల్లో హెచ్చరికలు పంపారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.
అలాగే రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా పై కూడా చురకలు వేసిన కేసీఆర్ HCU భూముల వివాదం పై కూడా తొలిసారిగా స్పందించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏడాదికే ప్రతిపక్ష పార్టీ సభకు ఇంతమంది ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారంటే అది బిఆర్ఎస్ విజయం గా భావించాలా.? లేక కాంగ్రెస్ ప్రభుత్వం అపజయం కింద పరిగణించాలా.? అన్న చర్చకు వస్తే,
Also Read – పాక్ పులుసు కారిందా.?
ఒకటి రేవంత్ సర్కార్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకున్న మాట వాస్తవమే అయినప్పటికీ బిఆర్ఎస్ సభకు తరలి వచ్చిన ప్రజా సమూహమంతా ప్రభుత్వ వ్యతిరేకులు గా పరిగణించలేము. ఇప్పటికే కాంగ్రెస్ గత బిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిని బయటపెట్టేందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలను వెలికితీసి బిఆర్ఎస్ అక్రమాలను ప్రజల ముందు పెట్టాలని భావిస్తుంది..
అలాగే ధనిక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ బిఆర్ఎస్ హయాంలో అప్పుల కుప్పగా మారిందంటూ కాంగ్రెస్ మంత్రులు కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పై దూకుడుగా ముందుకొస్తే అధికారం చేతిలో ఉన్న రేవంత్ చేతులు ముడుచుకుని గమ్మున్న ఉంటారా.? గత ప్రభుత్వ అవినీతి, అక్రమాలు…వాటిలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ల పాత్ర పై ప్రభుత్వం సీరియస్ గా ముందుకెళ్లే అవకాశం లేకపోలేదు.
ఇప్పటికే కేటీఆర్ పై ఫోన్ టాపింగ్ ఆరోపణలు, ఈ ఫార్ములా రేసింగ్ కేసులో సిబిఐ విచారణను ఎదుర్కున్న దాఖలాలు ఉన్నాయి. కవిత లిక్కర్ స్కాం కేసులో దాదాపు ఆరు మాసాలు తీహార్ జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇలా కేసీఆర్ కుటుంబం మొత్తం ఎదో ఒక కేసులో అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో కేసీఆర్ బలప్రదర్శన రేవంత్ ప్రభుత్వాన్ని బయపెట్టగలదా.?
అయితే రేవంత్ సర్కార్ వేసే ప్రతి తప్పటడుగు బిఆర్ఎస్ కు కలిసొచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ వేసే ఆ తప్పటడుగుల కోసమే వేచి ఉంటుంది. ఇప్పటికే హైడ్రా, HCU ఘటనలు కాంగ్రెస్ ప్రభుత్వం పై ఊహించని బురద జల్లాయి. దానికి తోడు కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలు ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారుతున్నాయి.
ఇలా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోయినా, చేసిన పొరపాట్లను సరిదిద్దుకోకపోయినా, అలాగే ఇక ముందు తీసుకోబోయే ప్రభుత్వ నిర్ణయాల పై కూడా రేవంత్ ఆచి తూచి వ్యవహరించక పోయినా కేసీఆర్ హెచ్చరిస్తున్నట్టు, బిఆర్ఎస్ పార్టీ ఆశిస్తున్నట్టు రాబోయే ఎన్నికలలో ఓడలు బండ్లయ్యే అవకాశాలు లేకపోలేదు.