వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ 2024 ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన జనసేనాని పవన్ కళ్యాణ్ హలో ఏపీ బై బై వైసీపీ అనే నినాదంతో ముందుకెళ్లారు. అనుకున్నట్టుగానే వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలను ఒకేతాటి మీదకు తెచ్చి 151 సీట్లతో అధికారంలో ఉన్న వైసీపీ ని 11 సీట్లకు పరిమితం చేసారు.
అయితే తాజాగా తెలంగాణ రాజకీయాల మీద ద్రుష్టి పెట్టిన పవన్ అందుకు తగ్గట్టుగానే హైద్రాబాద్ లోని మణికొండలో నేడు జనసేన నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసారు. పూజా కార్యక్రమాల అనంతరం తెలంగాణ తల్లి చిత్రపటానికి నివాళుర్పించి పార్టీ శ్రేణులకు ఒక భరోసా అందించారు.
అయితే పవన్ ఏపీలో మాదిరి తెలంగాణలో కూడా జనసేనను రాజకీయంగా ముందుకు తీసుకెళ్లగలరా.? అలా తీసుకెళ్లాలి అంటే తెలంగాణ రాజకీయాలలో జనసేన ఏదొక పార్టీ ఓటు బ్యాంకును చీల్చగలగాలి. తెలంగాణలో ఇప్పటికే అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బిఆర్ఎస్ కి పోటీగా బీజేపీ కూడా నేను సైతం అంటూ కథం తొక్కుతుంది.
ఇక కల్వకుంట్ల ఇంటి రాజకీయాలతో బిఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ వేటుతో బయటకొచ్చిన కవిత తెరాస 2.0 అంటూ తెరాస ప్రాంతీయవాద నినాదాన్ని ఎత్తుకుని రాబోయే కాలానికి కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి తానే అంటూ తనను తానూ తెలంగాణ అమ్మగా ప్రకటించుకుని దూకుడుగా రాజకీయంగా చేస్తున్నారు.
ఇటువంటి పరిస్థితులతో అధికార కాంగ్రెస్ ను కాదని, ప్రతిపక్ష బిఆర్ఎస్ ని దాటుకుని, దశాబ్దాల నుంచి రాజకీయ అవకాశం కోసం ఎదురుచూస్తున్న బీజేపీ ని వెనక్కి నెట్టి, తెరాస అనే తెలంగాణ భావోద్వేగాన్ని దాటుకుని టి. జనసేన ప్రజల ను తన వైపు తిప్పుకోగలదా.? ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చగలదా.?




