“కేసీఆర్ని ఇదే జైలులో చిప్పకూడు తినిపించకపోతే నా పేరు రేవంత్ రెడ్డే కాదు,” అంటూ ఆనాడు భీకర శపదం చేసిన రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి కాగానే అందుకు కేసులు, కమిటీలు, నివేదికలతో సన్నాహాలు మొదలుపెట్టేశారు. అంటే శాస్త్రీయ పద్దతిలోనే ప్రతీకారం తీర్చుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారన్న మాట!
ఇప్పటికే విద్యుత్ కొనుగోళ్లు ఒప్పందాలపై కమిటీ నివేదిక చేతికి వచ్చేసింది. నేడో రేపో కాళేశ్వరం ఫైలు కూడా చేతికి వస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అన్నివేళ్ళు కేసీఆర్ వైపే చూపిస్తున్నాయి.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ న్యాయమూర్తులు, పోలీస్ అధికారులు, ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ నేతల ఫోన్లను, అలాగే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ తదితర రంగాలకు చెందిన ప్రముఖుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేయించిన్నట్లు అరెస్ట్ అయిన పోలీస్ అధికారులు చెపుతున్నారు.
కనుక ఈ ఒక్క కేసుని రేవంత్ ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్ళగలిగితే కేసీఆర్ కధ ముగిసిపోయిన్నట్లే. కానీ ఈ కేసులో ప్రధాన సూత్రధారి ప్రభాకర్ రావు అమెరికా నుంచి తిరిగి రావడానికి ససేమిరా అంటున్నారు. కనుక ఈ కేసులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగు ముందుకు వేయలేకపోతోంది.
కనుక మిగిలిన రెండు కేసులని వేగవంతం చేస్తున్నారు. కానీ ఈ రెండు కేసులలో అనేక సాంకేతిక, ఆర్ధిక అంశాలతో ముడిపడి ఉన్నందున వీటిలో కేసీఆర్ని నిందితుడుగా నిరూపించడం దాదాపు అసంభవమే అని చెప్పొచ్చు.
రేవంత్ రెడ్డి తన శపధం నెరవేర్చుకోవడానికి ఈ రెండు కేసుల్లో కేసీఆర్కి నోటీస్ ఇచ్చి జైల్లో పెట్టగలరేమో కానీ ఎక్కువ రోజులు నిర్బంధించి ఉంచలేరు. ఆయన వెంటనే బెయిల్పై బయటకు వచ్చేసి ‘న్యాయం ధర్మం గెలిచాయని’ చెప్పుకోగలరు.
చంద్రబాబు నాయుడుని తప్పుడు కేసులో అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించి ముచ్చట తీర్చుకున్నందుకే జగన్ తన పదవి, అధికారం కోల్పోవలసి వచ్చింది. కనుక కేసీఆర్ని అరెస్ట్ చేస్తే తనకే నష్టం, బిఆర్ఎస్ పార్టీయే లాభపడుతుందని రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. అందుకే కేసీఆర్ని లోపల వేసేందుకు ఏమాత్రం తొందరపడటం లేదు.
కానీ ఆయనని మానసికంగా దెబ్బ తీసేందుకు ఫార్ములా-1 రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ని బుక్ చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. కనుక రేవంత్ రెడ్డి కేటీఆర్ని లోపల వేసి ముచ్చట తీర్చుకోగలరేమో కానీ కేసీఆర్ని టచ్ చేయ(లే)రనే భావించవచ్చు.






