ఆ ఫార్మాట్, ఈ ఫార్మాట్ అనే తేడా లేకుండా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తున్న సంగతి తెలిసిందే. సీనియర్ల నుంచి కొంత నేర్చుకోవడమో లేక కఠోర శ్రమతోనే లేక వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవడం వల్లో విరాట్ రాటుదేలిపోయాడని చాలా మంది భావిస్తుంటారు. కానీ ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మాత్రం విరాట్ విజయానికి నేనే కారణం అంటున్నారు.
తొలినాళ్లలో కోహ్లీ భారీ స్కోర్లు చేయలేకపోయేవాడని… అప్పుడు, నేర్చుకోవడం కొనసాగించాలని, ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలని విరాట్ కు తను సూచించానని రామ్ రహీమ్ తెలిపారు. అప్పటి నుంచి కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నాడని, టీమిండియాకు ఎంపికైన తర్వాత కోహ్లీ తనకు కృతజ్ఞతలు తెలిపాడని చెప్పారు. ఓ బాలీవుడ్ బ్లాగ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను తెలిపారు.
ఇదిలా ఉంటే, విరాట్ కోహ్లీ సాధించిన డబుల్ సెంచరీని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పలువురు ప్రముఖులు, అభిమానులు ట్వీట్ల వర్షం కురిపించారు. వరుసగా నాలుగు సిరీస్ ల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్ మెన్ గా, కెప్టెన్గా మరిన్ని రికార్డులు సొంతం చేసుకోవాలని క్రికెటర్ యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. టెన్నిస్లో ఇవో కార్లొవిక్ ఏస్ లు సాధించినట్లు క్రికెట్లో కోహ్లీ సరికొత్త రికార్డు సాధిస్తున్నాడని టెన్నిస్ క్రీడాకారుడు రోహన్ బోపన్న పేర్కొన్నాడు.



