ఏపీ, తెలంగాణ రాజకీయాలను, అభివృద్ధి, సంక్షేమ పధకాలను ఎలాగూ అందరూ పోల్చి చూస్తూనే ఉంటారు. ఇప్పుడు కేసుల విషయంలో కూడా పోల్చి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు, ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోళ్ళు, ఎఫ్-1 రేసింగ్ కేసులు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఆంధ్రాలో ప్రధానంగా వివేకా హత్య కేసు, మద్యం కుంభకోణం కేసులు కనిపిస్తున్నాయి.
ముందుగా తెలంగాణ కేసుల గురించి మాట్లాడుకుంటే ఫోన్ ట్యాపింగ్, ఎఫ్-1 రేసింగ్ కేసులలో తెలంగాణ ప్రభుత్వం వద్ద అనేక బలమైన సాక్ష్యాధారాలున్నాయి. కానీ మాజీ సిఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తదితరులని ‘టచ్’ చేయలేకపోతోంది.
తాను అరెస్టుకి సిద్దంగానే ఉన్నానని కేటీఆర్ చెప్పినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఆయనని అరెస్ట్ చేయలేకపోతోంది. వారిని అరెస్ట్ చేయకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతోందని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. బహుశః అది నిజమే కావచ్చు.
ఇటీవల హనుమకొండ బిఆర్ఎస్ పార్టీ సభలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలపై నిప్పులు చెరిగారు. కానీ బీజేపి, ప్రధాని మోడీ ప్రస్తావన కూడా చేయకపోవడం గమనిస్తే, కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ని కాపాడుతోందనే సిఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు నిజమని నమ్మాల్సివస్తుంది.
ఆంధ్రాలో రెండు కేసులలో కూడా ప్రధాన సూత్రధారి జగన్ అని ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ‘టచ్’ చేయలేకపోయింది. ఆయనని టచ్ చేస్తే తప్ప జగన్ వరకు చేరుకోలేదు. కానీ ఇంకా ఎప్పుడు? అనే ప్రశ్నకు బహుశః కూటమి నేతల వద్ద కూడా జవాబు దొరకదేమో?
మద్యం కుంభకోణంలో కూడా కూటమి ప్రభుత్వం వద్ద బలమైన సాక్ష్యాధారాలున్నాయి. కానీ ఈ కేసులో మిధున్ రెడ్డి, కసిరెడ్డి వంటివారే ముప్పతిప్పలు పెడుతున్నారు. కనుక ఎప్పటికైనా జగన్ వరకు చేరుకోగలదా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఒకవేళ చేరుకున్నా కేంద్ర ప్రభుత్వం జగన్ని కాపాడుతుందా లేదా?కాపాడితే సిఎం చంద్రబాబు నాయుడు చేతులు కూడా కట్టేసినట్లే అవుతుంది.
ఒకవేళ జగన్ అరెస్ట్ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోకపోయినా, అక్రమాస్తుల కేసులలో దాదాపు 12 ఏళ్ళుగా, వివేకా కేసులో 6 ఏళ్ళుగా ఫుట్బాల్ ఆడుకుంటున్న జగన్కి, మద్యం కుంభకోణం కేసుల విచారణ ముందుకు సాగకుండా అడ్డుకోవడం పెద్ద కష్టం కాదు.
మరో రెండు-మూడేళ్ళు అడ్డుకుంటే చాలు.. ఆ తర్వాత ఎన్నికల హడావుడి మొదలైపోతుంది. ఇక అప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఏమీ చేయలేకపోవచ్చు.
కనుక ఈ రెండు కేసులను కూటమి ప్రభుత్వం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి జగన్ని టచ్ చేయగలుగుతుందా లేదా?అనేది చూడాలి.




