అనంతపురం జిల్లా, ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో ఎట్టకేలకు తీర్పు వెలువడింది. 2011లో సీబీఐ ఛార్జ్-షీట్ దాఖలు చేయగా, అప్పటి నుంచి 13 ఏళ్ళుగా సీబీఐ కోర్టు విచారణ జరుపుతూనే ఉంది. కానీ మే నెలాఖరులోగా ఈ కేసు విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గడువు విధించడం వలన ముగిసింది కానీ లేకుంటే మరో 10 ఏళ్ళు సులువుగా సాగిపోయేది.
ఈ కేసు విచారణ జరుపుతున్న హైదరాబాద్, సీబీఐ కోర్టు నేడు తుది తీర్పు వెలువరిస్తూ, ఈ కేసులో ఏ1గా ఉన్న బీవీ శ్రీనివాసరెడ్డి, ఏ2: గాలి జనార్దన్రెడ్డి, ఏ3: వీడీ రాజగోపాల్ (గనుల శాఖ మాజీ డైరెక్టర్), ఏ7: కె.మెఫజ్ అలీఖాన్ (గాలి జనార్ధన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు) నలుగురు దోషులుగా నిర్ధారించింది.
ఓబుళాపురం గనులలో అక్రమ మైనింగ్కు వీరు నలుగురు పూర్తి బాధ్యులని సీబీఐ కోర్టు తేల్చి చెప్పింది. ఇదే కేసులో దోషిగా పేర్కొనబడిన మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి కృపానందంలను నిర్దోషులుగా ప్రకటిస్తూ వారికి ఈ కేసు నుంచి విముక్తి ప్రసాదించింది. ఈ కేసులో అరెస్ట్ అయి జైలులో గడిపిన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి 2022లోనే హైకోర్టు ఈ కేసు నుంచి విముక్తి కల్పించింది.
ఈ కేసుపై 13 ఏళ్ళు విచారణ జరిపి తీర్పు వెలువరించినందున వారికి శిక్షలు పడి జైలు జీవితం అనుభవిస్తారని ఎవరైనా అనుకుంటే అది వారి అమాయకత్వమే అవుతుంది. సీబీఐ కోర్టులో 13 ఏళ్ళు లాగించేసిన తర్వాత హైకోర్టులో 13 ఏళ్ళు, సుప్రీంకోర్టులో 13 ఏళ్ళు విచారణ సాగినా ఆశ్చర్యం లేదు. జగన్ అక్రమాస్తుల కేసులు, వివేకా హత్య కేసు విచారణలు ఇలాగే సాగుతున్నాయి కదా?కనుక ఈ తాజా తీర్పుతో గాలి అండ్ కోకి వచ్చే నష్టమేమీ ఉండకపోవచ్చు.




