ఇదివరకు సీబీఐ ఏదైనా ఓ కేసు విచారణ జరుపుతోందంటే నిందితులకు మూడినట్లే… తప్పించుకోలేరని ప్రజలు భావిస్తుండేవారు. కానీ ఈడీ, సీబీఐ, ఐటిలు కేంద్రం చేతిలో ఆయుధాలుగా మారినప్పటి నుంచి వాటి విశ్వసనీయత దెబ్బ తింది.
అంతమాత్రన్న వాటికొచ్చే నష్టం ఏమీ లేదు. వాటి డైరెక్టర్లు, అధికారులు, సిబ్బంది అందరికీ టంచనుగా జీతభత్యాలు అందుతుంటాయి. పదోన్నతులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా లభిస్తూనే ఉంటాయి. కనుక వారి చేతికి ఏ కేసు అప్పగిస్తే దాంతో ముందుకు సాగిపోతుంటారు.
కానీ రాజకీయ కారణాల వలన చివరికి కొన్ని కేసులకు బ్రేకులు పడుతుంటాయి.. లేదా ఏకంగా అటకెక్కిపోతుంటాయి. అందుకు సీబీఐ వారు కూడా బాధపడటం మానేసే ఉంటారు. లేకుంటే వివేకా హత్య కేసు పరిష్కరించలేకపోయినందుకు సిగ్గుతో ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చేది.
కనుక సీబీఐకి కేసు అప్పగిస్తే ఏదో ప్రళయం ముంచుకు వస్తుందని ఇప్పుడు ఎవరూ భయపడటం లేదు. అలాగని ప్రభుత్వాలకు సీబీఐపై నమ్మకమూ పోలేదు.
అందుకే తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం కేసుని, ఏపీ ప్రభుత్వం సుగాలి ప్రీతీ కేసుని సీబీఐకి అప్పగించి అనూహ్యంగా ఏదో జరిగిపోతుందని ఆశిస్తున్నాయి లేదా అలా అనుకోమని ప్రజలకు చెపుతున్నాయి.
తాము కాళేశ్వరం కేసుపై సీబీఐ చేత విచారణ జరిపించాలని లేఖ వ్రాసి నెలరోజులైనా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి బాధపడుతున్నారు.
తన తండ్రి (వివేక) హత్య కేసులో సీబీఐ పిల్లి మొగ్గలు వేస్తోందని సునీతా రెడ్డి బాధపడుతూనే ఉన్నారు. బహుశః రేపు సుగాలి ప్రీతీ కేసు విషయంలో ఆమె తల్లి తండ్రులు కూడా ఇలాగే బాధపడినా ఆశ్చర్యం లేదు. దేశంలో ఇతర రాష్ట్రాలలో కూడా సీబీఐ ఆశలు పెట్టుకున్నవారు లేదా బాధితులు చాలా మంది ఉండే ఉంటారు.
కానీ మద్యలో ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి. దాంతో పాటు కేసుల విచారణ తీరు కూడా మారుతుంది. కానీ సీబీఐ మాత్రం తామరాకు మీద నీటి బొట్టులా కేసులతో అంటీ అంటనట్లు ముందుకు సాగిపోతూనే ఉంటుంది.




