ఈ విందుని జగన్‌ జీర్ణించుకోలేరేమో?

CBN Amith Shah Dinner Meeting At Undavalli

అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా కంటే బీజేపి రాజకీయ వ్యూహకర్తగానే ఎక్కువ గుర్తింపు కలిగి ఉన్నారు. ఆయన బీజేపి అధ్యక్షుడు కాకపోయినప్పటికీ పార్టీ వ్యవహారాలన్నీ ఆయన కనుసన్నలలోనే నడుస్తాయని అందరికీ తెలుసు. ఎన్నికల సమయంలో బీజేపి అభ్యర్ధుల ఎంపిక, వ్యూహాలు, పొత్తులు వంటి ముఖ్య నిర్ణయాలలో ఆయన చెప్పిన ప్రకారమే సాగుతుంటుంది.

బీజేపిలో ప్రధాని మోడీ తర్వాత రెండో స్థానంలో ఉంటూ ఇంత కీలకపాత్ర పోషిస్తున్న అమిత్ షా, శనివారం రాత్రి ఉండవల్లిలో సిఎం చంద్రబాబు నాయుడు నివాసానికి రావడాన్ని ‘మర్యాదపూర్వక భేటీ’ అని చెప్పుకుంటే, కీలకమైన ఈ సమావేశాన్ని తక్కువ చేసి చెప్పుకున్నట్లే.

ADVERTISEMENT

అమిత్ షా నేడు గన్నవరం మండలంలో కొండపావులూరులో ఏర్పాటు చేసిన ఎన్‌డీఆర్ఎఫ్ 10 వ బెటాలియన్ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేస్తారు. ఈ కార్యక్రమం కోసమే ఆయన ఢిల్లీ నుండి వచ్చినప్పటికీ, సిఎం చంద్రబాబు నాయుడుతో విందు సమావేశానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంది.

ఇక్కడ కూటమి ప్రభుత్వంలో బీజేపి, అక్కడ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వాములుగా ఉన్నాయి. ముందే చెప్పుకున్నట్లు అమిత్ షా రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెడతారు. నిన్న రాత్రి జరిగిన ఈ విందు సమావేశంలో రాష్ట్ర రాజకీయాలపై చర్చ జరిగిందని సాక్షి మీడియా కూడా చెపుతోంది. కనుక ఖచ్చితంగా నమ్మాల్సిందే.

ప్రస్తుతం కూటమిలో మూడు పార్టీల మద్య ఎటువంటి వివాదాలు లేవు. వాటి మద్య మంచి సఖ్యత కూడా ఉంది. ప్రభుత్వం చాలా బలంగా స్థిరంగా ఉంది. కనుక వాటి మద్య పదవుల పంపకాల గురించి తప్ప పెద్దగా చర్చించాల్సిన రాజకీయాలు లేవనే చెప్పాలి.

కనుక ‘రాష్ట్ర రాజకీయాలపై చర్చ’ అంటే వైసీపీ గురించే అని అనుకోవచ్చు. వైసీపీ పరిస్థితి, జగన్‌ రాజకీయాల గురించి అమిత్ షాయే సిఎం చంద్రబాబు నాయుడుని అడిగి తెలుసుకున్నారు.

ఆయనకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌, ఏపీ బీజేపి అధ్యక్షురాలు పురందేశ్వరి తదితరులు ఏం చెప్పారో మీడియాలో వస్తున్నవి చాలా వరకు ఊహాజనీతమైనవే అని భావించవచ్చు.

ఇప్పుడు జగన్‌ అధికారంలో లేనప్పటికీ ఏపీలో పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టేందుకు అందరూ భయపడుతున్నారు. కనుక భవిష్యత్‌లో జగన్‌ వలన ఇబ్బందులు తలెత్తవని సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ వారికి నచ్చజెప్పుకోవలసి వస్తోంది.

కనుక ఒకవేళ త్వరలో జగన్‌ కేసులలో కదలికలు వేగవంతం అయితే, ఈ సమావేశంలో జగన్‌తో ఎదురవుతున్న ఈ సమస్య గురించి చంద్రబాబు నాయుడు అమిత్ షాకు చెప్పిన్నట్లే భావించవచ్చు. కనుక ఈ విందు సమావేశం ఫలితాలు ఏవిదంగా ఉంటాయో జగన్‌తో సహా వైసీపీ నేతలందరూ కూడా ఎదురుచూడక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories