2024 ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికలు, వాటి తాలూకా ఫలితాలు ఇక ఆ పిమ్మట జరిగిన పరిణామాలు అన్ని కూడా అటు టీడీపీ, ఇటు జనసేన కుటుంబాలకు ఎన్నో భావోద్వేగ అనుభూతులను, మరెన్నో మరువలేని తీపి జ్ఞాపకాలను మిగిల్చాయి.
40 ఏళ్ళ అనుభవం ఐదేళ్ల అహంకారం ముందు బందీగా నిలిచిన వేళ, అలాగే పదేళ్ల సహనం ఐదేళ్ల అరాచకానికి ప్రశ్నగా నిబడిన వేళ….ఒక నియంత పాలనను ఎదురించి పోరాడడానికి, ఒక ఉన్మాద చర్యలను తట్టుకుని నిలబడడానికి రెండు పార్టీల నేతలు ఒకటయ్యారు.
అలాగే ఏపీ రాష్ట్ర ప్రజలను ఒకే తాటి మీదకు తెచ్చారు. దీనితో పాతికేళ్ల రాష్ట్ర భవిష్యత్ తన గెలుపు జెండాను ఎగరేసింది. ఈ సారి ఏపీలో జరిగిన ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు అటు టీడీపీ, ఇటు జనసేన రెండు పార్టీలకు కుడా జీవన్మరణ సమస్యగా మారాయి.
ఏపీ రాష్ట్ర రాజధానిని మార్చి తన అహం చల్లార్చుకున్న జగన్, ఇక టీడీపీ అధినేత చంద్రబాబుని జైలుకి పంపి తన పంతం నెరవేర్చుకున్నారు. అలాగే జనసేన అధినేత పవన్ పై వ్యక్తిగత దూషణలకు తెగబడి తన పైశాచిక ఆనందాన్ని తీర్చుకున్నారు. ఇక ఆంక్షలతో లోకేష్ ను కట్టడి చేయడానికి యత్నించారు.
ఈ నేపథ్యంలో ఈసారి గెలుపు ఓటములు అనేది ప్రతి పార్టీకి అత్యంత కీలకంగా మారింది. ఇటువంటి సమయంలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ పవన్ చేసిన ఒకేఒక్క ప్రకటన ఏపీ రాజకీయ భవిష్యత్ మీద ఎన్నో ఆశలను చిగురింపచేసింది.
ఇక బాబు అరెస్టు, పవన్ నిర్బంధం రెండు కలిసి వైసీపీ వై నాట్ 175 కల ను పగటికలగా మార్చేశాయి. తమ అధినేత ఐదేళ్ల అవమానాలకు, తమ ఐదేళ్ల అలుపెరుగని పోరాటాలకు 2024 ఎన్నికలు వేదిక నిలిచిన వేళ పసుపు జెండా ఆవేశంతో ఎరుపెక్కింది, ఎర్ర జెండా ఆలోచనతో పసుపుగా మారింది.
ఇక ఈ పసుపు, ఎరుపు కలయిక మూడు రంగుల వైసీపీ మూడు ముక్కలాటకు ముగింపు పలికాయి. నాటి ఎన్నికల నిర్వహణ శైలిని పరిశీలించినా, ఎన్నికల ఫలితాలను జ్ఞప్తికి తెచ్చుకున్న వాటి మధ్య ఎన్నో భావోద్వేగ సంఘటనలు చోటు చేసుకున్నాయి. పార్టీ గెలుపు కోసం మహిళా కార్యకర్తలు సైతం వైసీపీ అరాచకాన్ని తన నెత్తురు తో చల్లార్చారు.
అసెంబ్లీ సాక్షిగా తనకు జరిగిన అవమానానికి గాను ‘చంద్రబాబు నాయుడు అనే నేను’.. అంటూ బదులిచ్చారు బాబు, ఇక మూడు పెళ్లిళ్లు అంటూ సీరియల్ మాదిరి సాగిన వైసీపీ అంతులేని కథకు ‘పవన్ కళ్యాణ్ అనే నేను’..అంటూ సమాధానం చెప్పారు పవన్. ఇక మూడు రాజధానులు అంటూ జగన్ ఆడిన మూడు ముక్కలాటకు గాను ‘అమరావతి అనే నేను’..అంటూ ఆంధ్రప్రదేశ్ గొంతెత్తి అరిచింది.
ఈ అనే నేను ఎన్నడూ లేని విధంగా టీడీపీ, జనసేన కుటుంబాలకు వెలకట్టలేని ఆనందభాష్పాలను అందించాయి. నాడు బాలయ్య భువనేశ్వరి నుదుటన ముద్దు పెట్టిన దృశ్యం నుండి పవన్ చిరుల అనుభందం, బాలకృష్ణ, లోకేష్ ఆప్యాయత, లోకేష్, పవన్ ల ఆత్మీయత, బాబు, పవన ల స్నేహ బంధం..ఇలా అటు బాబు కుటుంబ సభ్యుల ఆనంద పరవశాలు, ఇటు పవన్ కుటుంబ సంబరాలు అన్ని కలగలిపి ‘ఆంధ్రప్రదేశ్’ అనే నేను ని గెలిపించాయి. సగర్వంగా తలెత్తుకుని నిలబెట్టాయి.




