రాష్ట్ర విభజన జరిగిన నాటి నుండి కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఎంతమేర ఆర్ధిక సహాయం చేసింది? అన్న ప్రశ్న సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. దీనికి కేంద్రం ఒకప్పుడు 1.68 కోట్లు సహాయం చేసామని లెక్కలు చెప్పుకొచ్చింది. అయితే అవన్నీ ‘కాకి లెక్కలు,’ అందులో వాస్తవం లేదన్న విషయం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా రాష్ట్ర ప్రజానీకానికి తెలిసిన విషయమే. అయితే 1.68 కోట్లు కాదు… మరెంత సహాయం కేంద్రం చేసింది..? ఇదే ప్రశ్నను టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ అడగగా, కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్ నుండి లిఖితపూర్వక సమాధానం లభించింది.
విభజన జరిగిన నాటి నుండి మార్చి 2016 వరకు ఏపీకి కేంద్రం 6,403 కోట్లు విడుదల చేసిందని జవాబు చెప్తూ… ఆ మొత్తం లెక్క కూడా చెప్పుకొచ్చారు. రెవిన్యూ లోటు క్రింద 2803 కోట్లు, 7 వెనుకబడిన జిల్లాలకు 700 కోట్లు, రాజధాని అమరావతికి 2050 కోట్లు, జాతీయ ప్రాజెక్ట్ పోలవరంకు 850 కోట్లు మంజూరు చేసినట్లుగా చెప్పుకొచ్చారు. ఇవి ‘కాకి’ లెక్కలు కావు, ఇదే కేంద్రం నుండి గత రెండు సంవత్సరాలుగా ఏపీకి లభించినది. అందులోనూ అమరావతి పేరుతో చెప్తున్న నిధులలో విజయవాడ, గుంటూరులకు కేటాయించిన 1000 కోట్లు కూడా ఉండడం విశేషం.
ఏపీకి లక్షల లక్షల కోట్లు ఇచ్చేసామంటూ ప్రకటనలు చేస్తున్న కేంద్ర ఆర్ధిక మంత్రి గారు ఇప్పుడేమంటారు? ఈ లెక్కలన్నీ స్వయంగా తమ కేంద్ర మంత్రి గారు వివరించినవే కదా..! ఇందులో తప్పులు దొర్లడానికి ఆస్కారం లేదు. ఒక రాజధాని నగరం కూడా లేకుండా, తీవ్ర ఆదాయ లోటుతో ఉన్న రాష్ట్రానికి పట్టుమని 6500 కూడా ఇవ్వలేనంత ధీన స్థితిలో మనదేశ ఆర్ధిక వ్యవస్థ ఉందంటే నమ్ముతారా? నిజంగా అదే అయితే నేపాల్ లో భూకంపం వచ్చిందని ప్రధాని మోడీ 10 వేల కోట్లు ఎలా మంజూరు చేయగలిగారు? భూకంపం రాలేదన్న మాటే గానీ, అంతకుమించిన విషాదం విభజన ద్వారా ఏపీలో అలుముకుందన్న విషయం కేంద్రానికి తెలియదా?
హుదుద్ తుఫాన్ వచ్చి విశాఖ అంతా కొట్టుకుపోతే, స్వయంగా ప్రధాని మోడీ వచ్చి ‘తక్షణ సహాయం’ క్రింద 1000 కోట్లు అని మీడియా ముఖంగా చెప్పి, కేవలం 380 కోట్లు మాత్రమే ఇవ్వడాన్ని బహుశా మోడీ మరిచిపోయినా, ఏపీ ప్రజలు మరిచిపోరని చెప్పడంలో సందేహం లేదు. తక్షణ సాయమే పూర్తిగా ఇవ్వని మన ప్రధాని, ఆ తర్వాత అసలు సాయం గురించి మాట్లాడుకోవడం అత్యాశే అని చెప్పుకోక తప్పదు. అంటే కుటిల రాజకీయ బీభత్సానికి ఏపీ బలైనా… ప్రకృతి బీభత్సానికి బలైనా… కేంద్రానికి పట్టదన్న సంకేతాలు అప్పుడే వ్యక్తమయ్యాయి. ఏపీ జనాలకు తెలియడానికే కాస్త ఆలస్యమైంది.
ఇచ్చిన 6403 కోట్ల గురించి కేంద్ర సర్కార్ మళ్ళీ మళ్ళీ గొప్పలు చెప్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో, గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలు తమ ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పారు. 175 మంది కాంగ్రెస్ తరపున పోటీ చేస్తే 174 మందికి కనీసం డిపాజిట్ కూడా లేకుండా ఇచ్చిన తీర్పు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. బిజెపికి ఏపీలో పోటీ చేయడానికి కనీసం కాంగ్రెస్ స్థాయి కూడా లేకపోయినప్పటికీ, తమకు అవకాశం చిక్కిన సమయంలో ఏపీ ప్రజలు గట్టిగానే బుద్ధిచెప్తారని చెప్పకతప్పదు.



