ప్రముఖ ప్రవచకులు శ్రీ చాగంటి కోటేశ్వరరావుగారు సోమవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ‘విలువల విద్యా సదస్సు’లో కుటుంబ విలువలు ఏవిదంగా ఉండాలనే విషయంపై సరళమైన భాషలో వివరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ ఆయన పాదాలకు నమస్కారం చేసి ఆయన చెప్పిన విషయాలను శ్రద్దగా విన్నారు.
కానీ ఆయన అంత గంభీరంగా చెపుతున్నప్పుడు మంత్రి నారా లోకేష్తో సహా సభికులు అందరూ ముసిముసినవ్వులు నవ్వుతూనే ఉన్నారు. ఇది చదివితే కారణం ఏమిటో మీకే తెలుస్తుంది.
“తల్లి నవమాసాలు ఆనందంగా బిడ్డలను కడుపులో మోసి తన ప్రాణం పణంగా పెట్టి వారికి జన్మనిస్తుంది. ఈ ప్రపంచంలో ప్రతీ ఒక్కరికీ తల్లి తండ్రులే ప్రధమ గురువులు. కనుక వారిని గౌరవించడం మన ధర్మం.
తల్లి తండ్రుల తర్వాత రక్తం పంచుకొని పుట్టిన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళతో కలిసిమెలిసి పెరుగుతాము. తల్లి తండ్రులు, కుటుంబం అనే గోడలను మరికాస్త విస్తరిస్తే అదే సమాజం!
తల్లి తండ్రులు, గురువులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళను గౌరవించాలి. కుటుంబ సభ్యుల మద్య చిన్నా పెద్ద సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. కానీ అంత మాత్రాన్న వారిని దూరం చేసుకూడదు.
మనకుఏవిధంగా కొన్ని నిశ్చితాభిప్రాయలు, అవసరాలు, సమస్యలు ఉంటాయో అదేవిదంగా వారికీ ఉంటాయని గ్రహించాలి. సర్దుకుపోవాలి తప్పితే ఎవరినీ దూరం చేసుకోకూడదు. కానీ నేడు సమాజంలో తల్లి తండ్రులను, గురువులను గౌరవించని వారే ఎక్కువున్నారు. తోబుట్టువులను దూరం చేసుకున్నవారు చాలా మందే ఉన్నారు.
కానీ ఇంట్లో తల్లి తండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళతో సర్దుకుపోలేనివారు బయట ఇతరులతో ఎలా సర్దుకుపోగలరు? వారిని ఉద్దరిస్తామంటే నమ్మశక్యంగా ఉంటుందా? తల్లి తండ్రులు, గురువులను గౌరవించలేనివారు ఇతరులను ఎలా గౌరవించగలరు?” అంటూ చాగంటివారు కుటుంబ విలువలను బోధించారు.
చాగంటి ప్రవచనం విని సభికులు ఎందుకు ముసిముసి నవ్వులు నవ్వుతున్నారో ఇంకా వివరించాలా?






