ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సభ్యులు అసెంబ్లీలో స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేస్తుండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “వాళ్లు రౌడీయిజం కావాలని అనుకుంటున్నారని, అయితే ఇక్కడ రౌడీయిజం జరగడానికి వీలులేదని, ఈ విషయాన్ని వైసీపీ సభ్యులు గుర్తుపెట్టుకోవాలని” చంద్రబాబు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి హోదాతో సమానమైన సాయాన్ని అందిస్తుందని, అలాగే పోలవరం ప్రాజెక్టుని అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని గర్వంగా చెబుతున్నామని సీఎం అన్నారు.
“మీకు భగవంతుడు నోరిచ్చాడు… దాన్ని సద్వినియోగం చేసుకోవాలి… కాదు దుర్వినియోగం చేసుకుంటామంటే మీకే నష్టం. మీరు ఒకటి అంటే మేము 100 అనగలం… అలా వద్దని మా వాళ్లకు చెప్పాను. బావితరాల భవిష్యత్తు కోసం మీరు తిట్టిన తిట్ల పట్ల మళ్లీ స్పందించకుండా సంయమనం పాటిస్తున్నాం, ఇష్టప్రకారం మాట్లాడకూడదు, మీకు సభ్యత లేదు, సంస్కారం లేదు. రాజ్యాంగానికి లోబడి నడుచుకోవాలి, మీకు హుందాతనం లేదు, రాజ్యాంగం అంటే నమ్మకం లేదు.. మీరు ప్రజల జీవితాలతో ఆడుకోవాలని చూస్తే, వారే మీ జీవితాలతో ఆడుకుంటారు’ అని మండిపడ్డారు.
పోలవరం ప్రాజెక్టు పని ఒక్కరోజు పని ఆగిపోతే 30 కోట్ల రూపాయల నష్టం వస్తుందని, ఆ పనులు ఆగిపోకుండా ఎంతో సమన్వయంతో పనిచేయాలని, లేదంటే ఎంతో నష్టం వస్తుందని చెప్పారు. ఇటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి నాబార్డు ద్వారా పోలవరంకి నిధులు అందిస్తుందని చెప్పారు. ఇది ఎంతో సంతోషించాల్సిన విషయమని అన్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టింది 2,533 కోట్ల రూపాయలు మాత్రమేనని, ఆ తరువాత ప్రభుత్వం ఖర్చుపెట్టింది 2,924 కోట్ల రూపాయలని, అయితే రెండున్నరేళ్లలో తాము ఖర్చుపెట్టింది 3500 కోట్లని స్పష్టత ఇచ్చారు.



