అమరావతి పై వైసీపీ చేస్తున్న విష ప్రచారానికి ముఖ్యమంత్రి బాబు తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. వరదలతో అమరావతి మునిగిపోయింది, రాష్ట్ర ప్రజల పన్నుల సొమ్మంతా ముఖ్యమంత్రి చంద్రబాబు వరద ప్రాంతంలో పెట్టుబడిగా పెట్టి ముంచేస్తున్నారు అంటూ వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలకు బాబు బ్రేకులు వేసే ప్రయత్నం చేసారు.
వైసీపీ ప్రచారం చేస్తున్నట్టు మునిగింది అమరావతి కాదు, వైసీపీ అంటూ బాబు వైసీపీ రాజకీయానికి చురకలు అంటించారు. ఇటువంటి విష ప్రచారాలు, అసత్య వార్తలే వైసీపీ పార్టీని నిండా ముంచాయని, అయినా ఇప్పటికి వైసీపీ తన బుద్ది మార్చుకోకుండా అదే బాటలో పయనిస్తూ అమరావతి వినాశనానికి ప్రణాళికలు వేస్తుందంటూ మండిపడ్డారు.
కనీసం అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వైసీపీ మునిగిపోయినా ఇంకా అరుంధతి సినిమాలోని భూతం మాదిరి వైసీపీ వదల బొమ్మాలి వదలా అంటూ అమరావతిని వెంటాడుతుందంటూ వైసీపీ కి కౌంటర్ ఇచ్చారు. ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తేనే రాష్ట్ర భవిష్యత్ బాగుంటుందంటూ చెప్పుకొచ్చిన బాబు వైసీపీ ని అరుంధతి సినిమాలోని పశుపతితో పోల్చారు.
అయితే ఇక్కడ భూతం, పశుపతి వైసీపీ అయితే ఆ భూతాన్ని భూస్థాపితం చేసి గద్వాల్ సామ్రాజ్యంలో వెలుగులు నింపిన జేజమ్మ కూటమి ప్రభుత్వమా.? అక్కడ గద్వాల్…ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గా మారిందా.? మరి ఆ పశుపతిని అంతం చేసిన అరుంధతి చేతిలో ఆయుధం మాదిరి ఈ వైసీపీ విష ప్రచారాన్ని సమాధి చేసే ఆయుధం కూటమి దగ్గర ఉందా.?





