ఏపీకి ప్రత్యేక హోదా ఎవరికీ అంతుపట్టని ఓ బ్రహ్మ పదార్ధంగా ఏవిదంగా మారిపోయిందో, అదేవిదంగా 5 ఏళ్ళ జగన్ పాలనలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిస్థితి కూడా అలాగే మారిపోయింది.
ఆంధ్రాలో బిఆర్ఎస్ పార్టీని విస్తరించేందుకు కేసీఆర్ దీనిని ఓ అద్భుత అవకాశంగా గుర్తించి చాలా డ్రామా నడిపించారు. కానీ రాష్ట్రాన్ని ఏలుతున్న జగన్మోహన్ రెడ్డికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటే వైసీపికి అది ఓట్లు కురిపిస్తుందని గ్రహించలేదు లేదా భావించలేదు!
మొత్తం మీద వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకం వరకు వచ్చేశాక అనివార్య కారణాల వలన బ్రేకులు పడ్డాయి. ఆ క్రెడిట్ కూడా కేసీఆరే క్లెయిమ్ చేసేసుకున్నారు. అది వేరే విషయం.
అయితే జగన్ చెప్పిన్నట్లు ఇప్పుడు మోడీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చాలా కీలకంగా మారారు. కనుక వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కాకుండా ఆపేందుకు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
గమ్మతైన విషయం ఏమిటంటే, దీనిని కూడా జగన్ గుర్తించలేదు ముందుగా తెలంగాణలో కేటీఆర్ గుర్తించారు. “టిడిపి 16 ఎంపీ సీట్లు గెలుచుకోగానే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బ్రేక్ వేయగలిగింది. కానీ తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలకు చెరో 8 ఎంపీ సీట్లు గెలుచుకున్నా సింగరేణి బొగ్గుగనుల వేలంపాటని ఆపలేకపోతున్నాయంటూ” విమర్శించారు.
కేటీఆర్ తమ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలను విమర్శించేందుకే టిడిపి ప్రస్తావన చేసినప్పటికీ తొలిసారిగా ఆయన టిడిపి గురించి వాస్తవం మాట్లాడారని చెప్పవచ్చు.
కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఇప్పటికే దీని గురించి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామితో, వైజాగ్ స్టీల్ ప్లాంట్కు బొగ్గుగనుల కేటాయింపు కోసం బొగ్గుశాఖ మంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడారు.
తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎంపీ సిఎం రమేష్, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మలతో కలిసి వెళ్ళి కేంద్రమంత్రి కుమారస్వామిని కలిసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని స్టీల్ ఆధారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)లో విలీనం చేయాలని విజ్ఞప్తి చేశారు.
తద్వారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మరింత బలోపేతంగా మారి లాభాలబాట పడుతుందని వారు కేంద్రమంత్రి కుమార స్వామికి విజ్ఞప్తి చేశారు. ఆయన సానుకూలంగా స్పందిస్తూ, ఈ ప్రతిపాదనపై సంబందిత అధికారులతో చర్చించి రెండుమూడు నెలల్లో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అంటే గట్టిగా ప్రయత్నిస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడుకునే అవకాశం ఉందని కానీ జగన్ అశ్రద్ద, ప్రయత్నలోపం వల్లనే చేజారిపోయే పరిస్థితి ఏర్పడిందని స్పష్టం అవుతోంది.
దశాబ్ధాలుగా నడుస్తున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడానికి ఆసక్తి చూపని జగన్, తన సొంత జిల్లా కడపలో కొత్త స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కానీ విశాఖ రాజధానిలాగే దానినీ నిర్మించకుండా చేతులు దులుపుకు వెళ్ళిపోయారు.




