టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం నుంచి మూడు రోజులపాటు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం రాయదుర్గం నియోజకవర్గంలో వేరుశనగ రైతులతో ముఖాముఖీ సమావేశమయ్యి వారి సమస్యలను అడిగి తెలుసుకొనున్నారు. రేపు సాయంత్రం ‘బాబు ష్యూరిటీ భవిష్యత్కు గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా రాయదుర్గం పట్టణంలో బహిరంగసభ నిర్వహించనున్నారు,
బుదవారం ఉదయం కనేకల్ హైస్కూల్ విద్యార్థులతో ముఖాముఖీ సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా రాయదుర్గం, కళ్యాణదుర్గం పట్టణాలలో చంద్రబాబు నాయుడు రోడ్ షో నిర్వహించనున్నారు.
అనంతరం ఉరవకొండ నియోజకవర్గంలో పెద్దకౌకుంట్ల గ్రామంలో టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కుమారుడు విక్రమ్ సింహా వివాహ విందుకు హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు.
గురువారం ఉదయం 10 గంటలకు ప్రజావేదిక కార్యక్రమంలో మహిళలతో సమావేశమవుతారు. ఆరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు టెక్స్టైల్ కార్మికులతో, 5 గంటలకు పట్టి రైతులతో సమావేశం కానున్నారు. వారితో సమావేశాలు ముగిసిన తర్వాత చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లా బనగానపల్లికి బయలుదేరి వెళతారు.
గత నెల 4న అన్నమయ్య జిల్లాలో అంగళ్ళులో పర్యటించినప్పుడు వైసీపీ శ్రేణులు ఆయనను అడ్డుకొనేందుకు ప్రయత్నించినప్పుడు టిడిపి, వైసీపీ శ్రేణుల మద్య ఘర్షణలు జరిగాయి. వాటికి చంద్రబాబు నాయుడే బాధ్యులని ఆరోపిస్తూ పోలీసులు ఆయనతో సహా పలువురు టిడిపి నేతలపై కేసులు నమోదు చేశారు.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు వైసీపీ అడ్డాగా భావిస్తున్న అనంతపురం జిల్లాలో పర్యటించబోతున్నందున, ఈసారి కూడా వైసీపీ నేతలు ఆయనను అడ్డుకొనేందుకు గట్టిగానే ప్రయత్నించవచ్చు. ఈ సందర్భంగా మళ్ళీ ఇరు పార్టీల మద్య ఘర్షణలు జరిగితే, రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి తమ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకే చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలు చేస్తున్నారని వైసీపీ నేతలు వాదించకుండా ఉండరు. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటిస్తే ఆయన కూడా అల్లర్లు సృష్టించేందుకే తిరుగుతున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు.
అంటే ప్రతిపక్ష నేతలు ఎవరూ జిల్లా పర్యటనలు చేయకూడదు. చేస్తే వారిని వైసీపీ అడ్డుకొంటుంది. అప్పుడు ఘర్షణలు జరిగితే వాటికి టిడిపియే బాధ్యత వహించాలి తప్ప వైసీపీకి ఎటువంటి సంబందమూ ఉండదన్న మాట! ఆ వెంటనే పోలీసులు టిడిపి నేతలు, కార్యకర్తలపైనే కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారిపోయింది. కనుక రేపు చంద్రబాబు నాయుడు అనంతపురంలో పర్యటించినప్పుడు కూడా ఇదేవిదంగా జరుగుతుందేమో?



