సభలన్నీ ఒకదిక్కు…ఏపీ సభ మరోదిక్కు..!

Chandrababu Naidu Andhra Pradesh Assembly

ఏపీ అసెంబ్లీ సమావేశాలతో పాటు ఒకపక్క పార్లమెంట్ సమావేశాలు, మరోపక్క తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడి వేడి చర్చలు జరుగుతూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి.

ADVERTISEMENT

అధికారపార్టీ పాలన పై ప్రతిపక్షాల విమర్శలు, ప్రతిపక్షాల విమర్శల పై అధికార పక్షాల కౌంటర్లు, మధ్యమధ్యలో సరదా సరదా సన్నివేశాలు, మరికొన్ని సందర్భాలలో గరం గరం ప్రసంగాలు, నేతల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్ళతో సభాసమావేశాలు ఆద్యంతం ‘నువ్వా నేనా’ అన్నట్టుగా సాగుతున్నాయి.

కానీ వాటన్నిటి సమావేశాలు ఒకలెక్క ఏపీ అసెంబ్లీ సమావేశాలు మరో లెక్క అన్నట్టుగా సాగుతున్నాయి. ఏపీలో ప్రతిపక్షమే లేనంతగా కూటమి పార్టీ నేతలకు పట్టం కట్టారు ఏపీ ప్రజానీకం. అయితే జగన్ తో సహా గెలిచిన ఆ 11 మంది వైసీపీ ఎమ్మెల్యే లు కూడా అసెంబ్లీకి హాజరుకాకపోవడంతో ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షమే లేకుండా పోయింది.

పాలక పక్షమే ప్రతిపక్షంగా మారి అర్ధవంతమైన చర్చలకు నిలయంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తుంది. గత ఐదేళ్లుగా అసెంబ్లీ ని కౌరవ సభగా మార్చిన జగన్ కు ఇప్పుడు గౌరవ సభ ఎలా ఉంటుందో చేసి చూపించారు సభా అధ్యక్షుడు చంద్రబాబు. నేడు లోక్ సభలో బడ్జెట్ పై చర్చ జరపగా ప్రతిపక్ష నేతగా రాహుల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి.

ప్రస్తుతం మోడీ, షా, భాగవత్, దోవల్, అంబానీ, అదానీ అనే ఆరుగురు భారతదేశాన్ని కంట్రోల్ చేస్తున్నారని అధికార పక్షంపై తన వాణి వినిపించారు. దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరాన్ని తెలియచేస్తూ రాహుల్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని పట్టుబట్టింది. ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాల విషయానికి వస్తే అధికార పార్టీ నేత, మంత్రి కోటమిరెడ్డి, ప్రతిపక్ష పార్టీ నేత జగదీష్ రెడ్డి మధ్య సవాళ్లు ప్రతిసవాళ్ళ పర్వం నడిచింది.

కానీ ఏపీ అసెంబ్లీలో గత ప్రభుత్వం తాలూకా అప్పుల పైన, విధి విధానాలపై ఎప్పటికపుడు శ్వేత పత్రాలను విడుదల చేస్తూ ప్రజలకు అన్ని విషయాలపైనా పూర్తి అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్రంలో పేదవాడి ఆకలి తీర్చడానికి 5 రూ.కే అన్నా క్యాంటిన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటిస్తే వాటితో పాటుగా డొక్కా సీతమ్మ క్యాంటిన్లను కూడా ఏర్పాటు చేయాలనీ ఉప ముఖ్యమంత్రి సూచించారు.

పవన్ సూచన మేరకు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసే మధ్యాన్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరును ఖరారు చేసారు విద్యాశాఖ మంత్రి లోకేష్. అలాగే ఆయా శాల మీద, వాటి విధి విధానాల మీద ఎమ్మెల్యే లు తమకున్న సందేహాలను, అపోహలను సభలోనే చర్చల రూపంలో అడిగి తెలుసుకుంటున్నారు. ఒక అర్ధవంతమైన గౌరవ సభ మాదిరి ఏపీ అసెంబ్లీ సమావేశాలు సాగుతున్నాయి. దీనికి ఒక రకంగా వైసీపీ కారణం కావచ్చు.

ADVERTISEMENT
Latest Stories