స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభం అయ్యాయి. కృష్ణాజిల్లా గుడివాడలో సిఎం చంద్రబాబు నాయుడు దంపతులు, మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ జిల్లాలలు, నియోజకవర్గాలలో మొత్తం 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. మరో రెండు నెలల్లో మరో మరో 203 ఏర్పాటు చేస్తామని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. హరేకృష్ణ ఛారిటబుల్ సంస్థతో కలిసి వీటిని నిర్వహిస్తున్నామని చెప్పారు.
గతంలో అన్నా క్యాంటీన్లను ప్రభుత్వమే నిర్వహించేది కానీ ఇకపై వీటి నిర్వహణ కోసం ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి వాణిజ్య సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, వివిద రంగాలలో ప్రముఖులు, ఎన్ఆర్ఐలు, ప్రజల నుంచి విరాళాలు సేకరించి నిర్వహించబోతోంది.
దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్ ఏర్పాటు చేసింది. అన్నా క్యాంటీన్లకు విరాళాలు ఇవ్వదలచినవారు ఎస్బీఐ అకౌంట్ నంబర్: 378 181 650 97 (ఐఎఫ్ఎస్సీ కోడ్: SBIN 0020 541)కు పంపించవచ్చు. సామాన్య ప్రజలు కూడా పెళ్ళిళ్ళు, పుట్టినరోజులు, ఇతర శుభసందర్భాలను పురస్కరించుకొని విరాళాలు పంపిస్తే, అన్నా క్యాంటీన్లలో ఏర్పాటు చేస్తున్న డిజిటల్ డిస్ప్లే బోర్డులలో వారి పేర్లు ఆరోజు ప్రదర్శించబడతాయి.
సంకల్పం మంచిదైతే దానికి భగవంతుడు కూడా తోడ్పడతాడు. సిఎం చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లకు విరాళాలు అందించాల్సిందిగా పిలుపునీయగా కృష్ణా జిల్లాకు చెందిన ఎంపీ బాలశౌరి, ఏడుగురు ఎమ్మెల్యేలు కలిసి రూ.50 లక్షలు విరాళం ఇచ్చారు. ముందుగా సిఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నా క్యాంటీన్లకు కోటి రూపాయలు విరాళం ఇచ్చారు.
దండమూడి చౌదరి అనే టిడిపి అభిమాని రూ.5,07,779 విరాళం ఇచ్చారు. ఇకపై రాబోయే నాలుగేళ్ళు ఏటా ఆగస్ట్ నెలలో అంతే సొమ్ము విరాళం ఇస్తానని ప్రకటించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాసరాజు కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. ఇంకా అనేక వందల మంది విరాళాలు పంపిస్తూనే ఉన్నారు.
ఒక్కో అన్నా క్యాంటీన్లు క్యాంటీన్ ద్వారా రోజుకి సుమారు 350 మందికి నామమాత్రపు ధరకే రుచికరమైన టిఫిన్స్, భోజనం అందించబడుతుంది. దీని కొరకు రోజుకి సుమారు రూ.26,250 ఖర్చు అవుతుంది. కనుక రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ సత్కార్యంలో భాగస్వాములు కావాలని సిఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
ఇదివరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయిస్తే, వాటిని జగన్ మూయించేసి పేదల కడుపుకొట్టారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికాగానే అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. ఈసారి వీటిని శాస్వితంగా నడిచేందుకు వీలుగా ట్రస్ట్ ఏర్పాటుచేయాలనే ఆలోచన చాలా అభినందనీయం.
కానీ మళ్ళీ జగన్ వస్తే మూయించేస్తారు. కనుక ఆవిదంగా చేయకుండా చట్టపరంగా కూడా తగిన ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది లేదా జగన్ ఎన్నటికీ అధికారంలోకి రాకుండా చంద్రబాబు నాయుడు అడ్డుకోవలసి ఉంటుంది.




