పెట్టుబడులే లక్ష్యంగా మరోసారి విదేశీ యానం చేపట్టిన ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు బృందం రష్యా బయలుదేరింది. ఇందులో భాగంగా తొలుత కజకిస్తాన్ రాజధాని నగరం అల్మాటిలో పర్యటించిన బృందాన్ని ‘కేబుల్ కార్’ ఆకర్షించింది. ఎంతగా అంటే… ఇదే తరహా ప్రాజెక్ట్ ను వెంటనే ఏపీలో కూడా ఏర్పాటు చేయాలి అనేటంతగా!
అల్మాటి నగరానికి దగ్గర్లోని కోక్ – టోబ్ పర్యాటక ప్రాంతానికి కేబుల్ కారులో వెళ్లిన చంద్రబాబు ఫిదా అయ్యారు. ఓ పర్వతాన్ని మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దిన వైనాన్ని ప్రశంసించారు. ఇక్కడి పర్యాటక ఆకర్షణలను స్వయంగా పరిశీలించిన మీదట, ఏపీలో ‘కేబుల్ కార్’ ప్రాజెక్టుకు అరకు, తిరుపతి వంటి ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు.
అంతేకాదు, ఈ ప్రాజెక్టు వ్యయంపై స్థానిక అధికారులను పలు ప్రశ్నలు వేసి తెలుసుకున్నారు. కోక్ – టోబ్ తరహాలో ఏపీలో ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సదరు అధికారులకు చంద్రబాబు తెలిపారు. ‘రోప్ వే’ మాదిరి ఉండే ఈ తరహా విధానంతో పర్యాటకులను మరింతగా ఆకర్షించవచ్చని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది.



