టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నేడు కుప్పం నియోజకవర్గంలో మూడోరోజు పర్యటిస్తున్నారు. శుక్రవారం కుప్పంలో మోడల్ కాలనీలో పర్యటించినప్పుడు జనాలు నీరాజనాలు పట్టారు. దారిపొడవునా ప్రజలు రోడ్లపైకి వచ్చి చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలికారు. అనేక చోట్ల మహిళలు చంద్రబాబు నాయుడు కారును ఆపి ఆప్యాయంగా చెయ్యి పట్టుకొని మాట్లాడగా, మరికొన్నచోట్ల చంద్రబాబు నాయుడు కారు వెనకే కొంతదూరం నడిచి వెళ్ళి అభిమానం చాటుకొన్నారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని చంకలు గుద్దుకొంటున్న వైసీపీ నేతలకు ఇది ఊహించని షాకే.
సిఎం జగన్మోహన్ రెడ్డి ఏ జిల్లాకైనా పర్యటనకు వెళితే పోలీసులు బ్యారికేడ్లు పెడుతుంటారు. వైసీపీ నేతలు ‘థాంక్యూ సిఎం సార్’ అంటూ ప్లకార్డులు సిద్దం చేయించి విద్యార్థుల చేతిలో పెట్టి రోడ్డు పక్కన నిలబెడతారు. కానీ చంద్రబాబు నాయుడు పర్యటనలో అందుకు పూర్తి భిన్నంగా ప్రజల వద్దకు ఆయన వెళుతుంటారు. ప్రజలు కూడా ఆయన వద్దకు వచ్చి ఆప్యాయం చేయి పట్టుకొని మాట్లాడుతుంటారు.
మరో విషయం ఏమిటంటే సిఎం జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనకు నిదర్శనంగా ప్రజల నెత్తిన చెయ్యిపెడుతుంటారు. కానీ చంద్రబాబు నాయుడు పర్యటనలో ప్రజలే ఆయన చేతిని పట్టుకొని ఆప్యాయంగా పలకరిస్తుంటారు. దీనిని బట్టి ఇద్దరికీ ఎంత తేడా ఉందో… ప్రజలు ఎవరిని అభిమానిస్తున్నారో అర్దం అవుతుంది.
ఇక ఈరోజు పర్యటనలో చంద్రబాబు నాయుడు సిఎం జగన్మోహన్ రెడ్డిని ఓ సూటి ప్రశ్న అడిగారు. తమిళనాడు రాష్ట్రంలో ఆనాడు జయలలిత హయంలో అమ్మా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే, ఆమెను బద్ద విరోధిగా భావించే డీఎంకె పార్టీ అధికారంలోకి వచ్చినా స్టాలిన్ వాటిని యదాతదంగా కొనసాగిస్తున్నారు. కనీసం వాటి పేరును కూడా మార్చాలనుకోలేదు. కానీ ఏపీలో మీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లను అన్నిటినీ అర్దాంతరంగా మూసేశారు. ఇప్పుడైనా మేము అన్నా క్యాంటీన్ పెట్టి పేదలకు కడుపు నిండా అన్నం పెడదామనుకొంటే మాకు ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందో అని అడ్డుకొంటున్నారు. పోనీ మీరే క్యాంటీన్లు పెట్టి పేద ప్రజల కడుపులు నింపి మంచి పేరు తెచ్చుకోవచ్చు కదా?అమ్మ పెట్టదు మరొకరిని పెట్టనివ్వదు అంటే ఇదే,” అని చంద్రబాబు నాయుడు విమర్శించారు.
“నేను కుప్పంలో మూడు వేలమందికి ఇళ్ళు కట్టించి ఇవ్వాలని పనులు మొదలుపెడితే వాటిని వైసీపీ ప్రభుత్వం అడ్డుపడింది. సరే… పోనీ మీరే ఓ 10 వేల ఇళ్ళు కట్టించి ఇవ్వచ్చు కదా?” అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
అయినా తలుపులు నమిలేసేవాడికి అప్పడాలు నమలడం ఓ లెక్కా? అన్నట్లు చంద్రబాబు నాయుడుపై రాజకీయకక్షతో రాజధాని అమరావతిపైనే కులం ముద్ర వేసి పక్కన పడేసినప్పుడు అన్నా క్యాంటీన్లు ఓ లెక్కా?



