వాలంటీర్ వ్యవస్థలో లోపాలు, జరుగుతున్న అక్రమాల గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ఆయనపై పరువు నష్టం దావా వేసేందుకు సిద్దమవుతోంది. దీనిపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు.
విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో జగన్ రెడ్డి అరాచక పాలన మొదలై నానాటికీ పెరుగుతూనే ఉంది. తన ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా జగన్ సహించలేకపోతున్నారు. తనను ప్రశ్నించేవారిపై పోలీసులతో కేసులు పెట్టించి వేదించేవారు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్పై ఏకంగా పరువు నష్టం దావా వేయడానికి సిద్దమవుతున్నారు. ఇదో బుద్ధిలేని, నీతిమాలిన చర్య. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాయి.
మేము అధికారంలో ఉన్నప్పుడూ మీరు మమ్మల్ని రోజూ ఇలా ప్రశ్నిచేవారు కాదా? అప్పుడు మేము ఎవరినైనా పోలీసులు కేసులు పెట్టి వేధించామా?లేదు కదా? ఎందుకంటే మేము ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నాము కనుక. అయితే జగన్ రెడ్డికి ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేదు కనుక ప్రతిపక్షాలను సహించలేకపోతున్నారు.
అసలు జగన్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టడం కాదు. ముందు జగన్ మీదనే కేసులు పెట్టాలి. రాజ్యాంగ బద్దత లేని వాలంటీర్ వ్యవస్థను సృష్టించడమే కాకుండా దాంతో ప్రజల వ్యక్తిగత వివరాలు సేకరించడం నేరం. పోలీసులు, అధికారులు అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేస్తునందుకు ముందు మీ మీదే కేసులు పెట్టాలి.
పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వం పరువుకి భంగం కలిగిందని పరువు నష్టం దావా వేయాలనుకోవడం మరో పెద్ద జోక్. అసలు ఈ ప్రభుత్వానికి పరువు ఉంటే కదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి రాష్ట్రం పరువు తీసేసాక, ఇప్పుడు కొత్తగా పోయే పరువు ఏముంది?
ఇంకా ఎంతకాలం ఈ అరాచకాలు చేస్తూ, పాపాలను దాచిపెడుతూ పాలన చేయగలరు? మరో తొమ్మిది నెలలు. అంతేగా! ఆ తర్వాత టిడిపి అధికారంలోకి వస్తుంది. మీ తప్పుల లెక్కలను సరిచేస్తుంది,” అని చంద్రబాబు నాయుడు అన్నారు.



