పోరాడకుండా చేతులెత్తేసి కేంద్రాన్ని నిందిస్తే ఏం ప్రయోజనం?

Chandrababu-Naidu-Naraతెలంగాణ ప్రజలందరూ తమకు తెలంగాణ రాష్ట్రం కావాలని కలిసికట్టుగా పోరాడి సాధించుకొన్నారు. తమిళనాడు ప్రజలు జల్లికట్టు క్రీడపై నిషేధం ఎత్తివేయాల్సిందే అని పట్టుబట్టి సాధించుకొన్నారు. కానీ ఏపీ ప్రజలు అమరావతి రాజధాని, పోలవరం, రైల్వేజోన్, ప్రత్యేకహోదా చివరికి వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ కోసం పోరాడేందుకు ముందుకు రావడం లేదు!

ADVERTISEMENT

అమరావతి రైతులు రాజధాని కోసం దాదాపు రెండున్నరేళ్ళుగా శాంతియుతంగా ఆందోళనలు చేస్తుంటే, వారిపై వైసీపీ నేతలు దౌర్జన్యాలు చేస్తున్నా ప్రజలు వారికి సంఘీభావం తెలిపేందుకు భయపడుతున్నారు.

రాష్ట్రం అప్పులపాలై మునిగిపోతోందని తెలిసినా, ఆ భారం పన్నులు, కరెంట్ ఛార్జీలు, బస్సు ఛార్జీల రూపంలో తిరిగి తమపైనే పడుతోందని తెలిసి ఉన్నా మౌనంగా అన్నిటినీ భరించేస్తున్నారే తప్ప ఎందుకిలా? అని ఎవరూ ప్రశ్నించడంలేదు.

కొన్ని విషయాలలో మనం ఏమీ చేయలేమనే నిర్లిప్తత, మరికొన్ని విషయాలలో వైసీపీ వేధింపులు భరించేలేమని ప్రజలు మిన్నకుండిపోతున్నారు.

మన రాష్ట్ర సమస్యల సమస్యల గురించి, మన హక్కుల గురించి, ఈ అరాచకాల గురించి ప్రజలు పోరాడటానికి ముందుకు రాన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని నిందించి ఏం ప్రయోజనం?అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలకు సూటి ప్రశ్న వేశారు. ఒక వ్యక్తి మూర్ఖపు ఆలోచనలకు రాష్ట్రం నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు.

అమరావతి, పోలవరం, పారిశ్రామిక అభివృద్ధి అన్నిటినీ ఈ జగన్ ప్రభుత్వం పక్కనపడేసి, ఇష్టారాజ్యంగా రాష్ట్రాన్ని దోచుకొంటూ, ఇదే సుపరిపాలన అని చెప్పుకొంటుంటే ప్రజలు నిమ్మకు నీరేత్తిన్నట్లు చూస్తూ ఉండిపోతున్నారని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే ఇటువంటి సమయంలోనే టిడిపి రాష్ట్రం పట్ల తన బాధ్యతను స్వీకరించి ధైర్యంగా పోరాడుతూ మళ్ళీ ప్రజలలో చైతన్యం తెచ్చి ఈ దుర్మార్గపు పాలన అంతమొందించేందుకు గట్టిగా ప్రయత్నిస్తోందని చంద్రబాబు నాయుడు చెప్పారు.

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఏం మాట్లాడినా, ఏం చేసినా వాటన్నిటికీ తానే బాధ్యుడినని, తానే ఆయనకు స్క్రిప్ట్ వ్రాసిస్తున్నానంటూ వాదించడం వైసీపీ నేతలకు ఓ దురలవాటుగా మారిపోయిందని, పవన్‌ కళ్యాణ్‌ను రాజకీయంగా ఎదుర్కొలేకనే తనపై బురద జల్లుతూ ప్రజలను తప్పు దోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు నాయుడు అన్నారు.

వైసీపీ నేతలు అవినీతికి, అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతుంటే, వారిని కట్టడి చేయాల్సిన పోలీస్ వ్యవస్థ వారి కనుసన్నలలో పనిచేస్తోందని, శ్రీకాళహస్తిలో ఓ మహిళా సిఐ జనసేన నేత మీద చేయిచేసుకోవడమే ఇందుకు నిదర్శనమని చంద్రబాబు నాయుడు అన్నారు.

రాష్ట్రంలో చిన్న పిల్లలు కూడా బలైపోతున్నారని అన్నారు. పదో క్లాసు చదువుతున్న ఓ బాలుడిని వైసీపీ నేత పెట్రోల్ పోసి సజీవ దహనం చేయగా, హాస్టల్లో నిద్రపోతున్న మరో గిరిజన బాలుడుని దుండగులు ఎత్తుకుపోయి పీక నులిమి హత్య చేశారని, ఇటువంటి ఘటనలు చూస్తే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎటుపోతోందని ఆవేదన కలుగుతోందని చంద్రబాబు నాయుడు అన్నారు.

వైసీపీ నేతలు ప్రజలనే కాదు… ప్రభుత్వోద్యోగులను, ఉపాధ్యాయులను, పోలీసులను కూడా వేధిస్తూ, బెదిరించి భయపెడుతున్నారని అన్నారు. ఈ వేధింపులు, ఒత్తిళ్ళు భరించలేక ఇటీవల ఓ సీఐ ఆత్మహత్య చేసుకోగా, ఉద్యోగ సంఘాల నాయకుడు సూర్యనారాయణ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారంటే వైసీపీ పాలన ఏవిదంగా సాగుతోందో అర్దం చేసుకోవచ్చని చంద్రబాబు నాయుడు అన్నారు.

ఉండవల్లిలో ప్రజావేదిక కూల్చివేయడంతో మొదలైన జగన్‌ విధ్వంసపాలన ఈ నాలుగేళ్ళలో రాష్ట్రమంతటా వ్యాపించిందని చంద్రబాబు నాయుడు అన్నారు. వాలంటీర్ల వ్యవస్థ రాజకీయాలకు దూరంగా ఉండకపోతే వారే నష్టపోతారని అన్నారు. ఇప్పటికైనా ప్రజలు జరుగుతున్న ఈ అనర్ధాలను గుర్తించి టిడిపితో కలిసి పోరాడేందుకు ముందుకు రావాలని చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు.

ADVERTISEMENT
Latest Stories