చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని విమర్శించాలనే యావతో సోషల్ మీడియాలో వైసీపి చేస్తున్న దుష్ప్రచారంతో జగన్మోహన్ రెడ్డినే వేలెత్తి చూపించుకున్నట్లుంది. ఎదుటవాడిని ఒక వేలితో చూపితే మిగిలిన నాలుగు వేళ్ళు మననే చూపిస్తుంటాయనే చిన్న విషయం మరిచిపోయిన్నట్లుంది వైసీపి.
“చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే సంపద సృష్టించి దానిని పేదలకు పంచిపెడతానన్నారని, కానీ అధికారంలోకి రాగానే అప్పుల వేట మొదలుపెట్టి 35 రోజులలోనే రూ.12,000 కోట్లు అప్పులు తెచ్చారని, ఇదేనా… చంద్రబాబు నాయుడు చెప్పిన సంపద సృష్టించడం?”అంటూ సోషల్ మీడియా వ్యంగ్యంగా ఓ పోస్ట్ పెట్టింది.
సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఐటి రంగానికి పునాది వేసి, అనేక ఐటి కంపెనీలను తెచ్చి సంపద సృష్టించి ఇచ్చారు. అందువల్లే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఆర్ధికంగా ఇబ్బంది పడలేదు. తెలంగాణ ధనిక రాష్ట్రమని కేసీఆర్ చెప్పుకున్నారు కూడా.
ఆ తర్వాత ఆయన కూడా అభివృద్ధి పేరుతో లక్షల కోట్లు అప్పులు చేసి రేవంత్ రెడ్డి చేతికి ఖాళీ ఖజానా అప్పగించి పోయారు. కనుకనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అప్పులు చేయక తప్పడం లేదు.
కేసీఆర్ ఎంత అప్పు చేసినా కనీసం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపారు. కానీ జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ఏం చేశారంటే సుమారు రూ.10 లక్షల కోట్లు అప్పులు చేశారు. ప్రభుత్వ ఆస్తులను కూడా తాక్కట్లు పెట్టేశారు. పోతూ పోతూ ఖజానాని పూర్తిగా ఊడ్చేయడమే కాకుండా చంద్రబాబు నాయుడు నెత్తిన అప్పులు, వడ్డీ భారం కూడా పెట్టిపోయారు.
అందువల్లే చంద్రబాబు నాయుడు కూడా అప్పుల వేటకు బయలుదేరక తప్పలేదు. ఒకవేళ జగన్ 5 ఏళ్ళ పాలనలో సంపద సృష్టించి ఖజానాని నింపి వెళితే చంద్రబాబు నాయుడు అప్పుల కోసం తిరగాల్సిన పని లేదు కదా?కానీ తిరగాల్సివస్తోంది అంటే ఎవరు కారణం? జగనే కదా?
ప్రజలు ఎంతో నమ్మకంతో ఒక్క ఛాన్స్ ఇస్తే చేయకూడని తప్పులన్నీ చేసి, రాష్ట్రానికి ఈ దుస్థితి కల్పించినందుకు జగన్ సిగ్గుతో తల దించుకోవాలి. కానీ ఇంకా నిసిగ్గుగా చంద్రబాబు నాయుడుని విమర్శిస్తున్నారు.
శిశుపాలుడు కేవలం వంద తప్పులే చేసి కృష్ణుడి చేతిలో హతం అయ్యాడు. కానీ జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు చేసిన తప్పులు లెక్కించడం ఎవరి వల్లా కాదు. అందుకు ప్రజలు చీత్కరించుకొని గద్దె దించినా జగన్ బుద్ధి, నైజం రెండూ మారలేదు. అంటే ఇంకా తప్పులు చేస్తూనే ఉంటారన్న మాట! మరి ఈ తప్పులకి ఏ శిక్ష విధించాలో?




