సెప్టెంబర్ 1 ఆదివారం అటు నారా ఇటు నందమూరి అభిమానులకు సంథింగ్ స్పెషల్ కాబోతుందా అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. నందమూరి నట సింహం బాలకృష్ణ తెలుగు చిత్ర సీమలో అడుగు పెట్టి దిగ్విజయంగా 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న తరుణంలో తెలుగు చిత్ర పరిశ్రమ దీనిని ఒక వేడుకల జరపడానికి సిద్దమయ్యింది.
ఈ ఆదివారం జరగనున్న బాలకృష్ణ 50 ఏళ్ళ సినీ ప్రస్థాన వేడుకలకు ఇండస్ట్రీ పెద్దలంతా హాజరవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే మెగా స్టార్ చిరుని సైతం ఈ వేడుకలకు ఆహ్వానించింది ఇండస్ట్రీ. ఇక నాగార్జున, వెంకటేష్, సిద్దు జొన్నల గడ్డ, విశ్వక్ సేన్, అల్లుఅర్జున్, రాంచరణ్, విజయ్ దేవర కొండా వంటి స్టార్లు బాలయ్యకు శుభాకాంక్షలు తెలపడానికి సై అంటున్నారు.
అయితే ఈ వేడుకకు జూ.ఎన్టీఆర్ కు ఆహ్వానం అందిందా? ఆయన ఈ ఆహ్వానాన్ని గౌరవించి ఈ వేడుకలకు హాజరవుతారా అన్న సందేహాలు నందమూరి అభిమానులను కలవర పరుస్తున్నాయి. గతంలో టీడీపీ నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు కూడా తారక్ దూరంగా ఉన్నారు. మరి బాలయ్య కోసం తారక్ అడుగు ముందుకేస్తారా లేక తప్పించుకుంటారా?
తన 50 ఎళ్ల సినీ కెరియర్ లో బాలకృష్ణ ఎన్నో మైలురాళ్ళు అధిగమించారనే చెప్పాలి. ప్రయోగాలకు సై అంటూ అటు భైరవ ద్వీపం నుండి ఇటు నరసింహనాయుడు వరకు, అటు శ్రీరామా రాజ్యం నుంచి ఇటు పైసా వసూల్ వరకు అన్ని జోనర్స్ ను టచ్ చేస్తూ అఖండ విజయాలను అందుకున్నారు బాలకృష్ణ. అటు తండ్రి సినీ వారసత్వం తో పాటుగా ఇటు రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ రెండు పడవల మీద సురక్షిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
అన్ స్టాపబుల్ అంటూ బుల్లి తెర మీద కూడా తొడ కొట్టారు బాలయ్య. ఇటు సినీ, రాజకీయ రంగాలలో తన ప్రస్థానాన్ని అన్ స్టాపబుల్ గా కొనసాగిస్తూనే అటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించి సేవ కార్యక్రమాలలో కూడా తన వంతు బాధ్యతగా సమాజానికి ఎంతోకంత తిరిగి ఇచ్చేస్తున్నారు బాలకృష్ణ. కల్మషం ఎరుగని వ్యక్తిగా, ఉన్నది ఉన్నట్లు కుండబడ్దలు కొట్టే మస్తత్వంతో ‘జై బాలయ్య’ అనిపించుకుంటున్నారు.
బాలకృష్ణ జీవితంలో జరగబోతున్న ఈ అరుదైన ఘట్టానికి ఈ ఆదివారం వేదికయ్యింది. దీనికి అటు సినీ రంగం నుండే కాకుండా ఇటు టీడీపీ పార్టీ కూడా బాలకృష్ణ వేడుకలలో పాలుపంచుకోనుంది. అయితే నందమూరి అభిమానుల సందడి అలా ఉంటే ఈ ఆదివారం నారా వారి కుటుంబంలో వేడుకకు మరో కారణం చంద్రబాబు నాయుడు అయ్యారు.
40 ఏళ్ళ తన రాజకీయ జీవితంలో ఈ ఆదివారంతో తొలిసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసి 30 ఏళ్ళు పూర్తికాబోతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకోవడానికి సిద్ధమయ్యారు.
ఈ 30 ఏళ్లలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మరో పద్నాలుగేళ్ళ ప్రతిపక్ష నేతగా రాజకీయాన్ని కొనసాగించిన బాబు ఈ ఎన్నికలతో కలుపుకుని 2029 నాటికి మొత్తంగా 19 ఏళ్ళు ముఖ్యమంత్రిగా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు తన సేవలందించారు. సైబరాబాద్ నిర్మాణముతో తెలంగాణలో తన మార్క్ చూపించిన ఈ పెద్దాయన ఇప్పుడు అమరావతి నిర్మాణాలతో మరోసారి తన విజనరీని ఆవిష్కరించడానికి ఆశ పడుతున్నారు.
ఇలా తెలుగువాడి సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి తన జీవితం మొత్తం రాజకీయాలకే అంకితం చేసి ఒక విజనరీ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుని తన దార్శికతను ప్రదర్శిస్తూ విలువలతో కూడిన రాజకీయం చేస్తూ ఏంతో మందికి ఆదర్శంగా నిలిచారు. అలాగే తన రాజకీయ జీవితంలో ఎంతో మంది రాజకీయ నాయకులను, లీడర్లను సృష్టించిన సృష్టికర్త బాబు.
ముఖ్యమంత్రి అనే పదవికే ఒక హుందాతనాన్ని తీసుకు వచ్చి ప్రజల వద్దకే పాలన అంటూ నాయకుడు ప్రజల సేవకుడు అని ఆచరించి చూపించారు బాబు. గత తరం నాయకులతో పోటీ పడుతూ ఈ తరం రాజకీయ నాయకులకు ఆదర్శంగా ఉంటూ అటు కొత్త ఇటు పాత ఆలోచనలతో నిత్య విద్యార్థిగా పాలన కొనసాగిస్తున్న బాబు జీవితం ఒక రాజకీయ డిక్షనరీ.
ఈ రెండు వేడుకలకు కూడా ఈ ఆదివారమే వేదికైన నేపథ్యంలో ఇటు నారా అటు నందమూరి కలయికతో కూడిన టీడీపీ పార్టీకి ఈ ఆదివారం సంథింగ్ స్పెషలే అంటున్నారు బాబు, బాలయ్య అభిమానులు. చూస్తుంటే “జై బాబు…జై బాలయ్య” నినాదాలతో ఈ ఆదివారం హోరెత్తడం ఖాయంగా కనపడుతుంది.




