ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాల్సిన ‘ప్రత్యేక హోదా’ను కొన్ని సాంకేతిక కారణాల వలన ఇవ్వలేకపోతున్నాం, అయితే అంతే సమానమైన విలువ కలిగిన మొత్తాన్ని ‘ప్రత్యేక ప్యాకేజ్’ రూపంలో ఇస్తామంటూ అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన అందరికీ తెలిసిందే. అయితే ప్యాకేజ్ బాగానే ఉంది గానీ, దీనిని తాము ఎలా నమ్మాలి? ఈ ప్యాకేజ్ కు చట్టబద్ధత కల్పించాలి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయగా, ‘ఖచ్చితంగా చట్టబద్ధత కల్పిస్తాం’ అని కేంద్రం హామీ ఇచ్చింది.
ఆ కార్యక్రమం ఈ బుధవారం నాటితో పూర్తి కాబోతోంది. ‘ప్రత్యేక హోదా’ విషయంలో దెబ్బ తిని ఉన్న ఏపీ సర్కార్ కు ‘ప్రత్యేక ప్యాకేజ్’ చట్టబద్ధత కల్పిస్తే… దాదాపుగా ‘ప్రత్యేక హోదా’ను సాధించినట్లే చెప్పుకోవచ్చు. దీంతో కేంద్రంపై చంద్రబాబు నాయుడు పంతం నెగ్గినట్లవుతుంది. చంద్రబాబు చేస్తోన్న ఒత్తిడితో గత రెండు రోజులుగా కేంద్రమంత్రి సుజనా చౌదరి ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీతోనూ, ఆర్ధిక శాఖ అధికారులతోనూ కసరత్తులు చేస్తున్నారు. కేంద్రం చెప్పిన ప్రతి చిన్న అంశం కూడా ప్యాకేజ్ లో ఖచ్చితంగా ఉండేలా చూడాలని చంద్రబాబు చెప్పడంతో, ప్రతి ఒక్క అంశాన్ని సుజనా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.
బుధవారం నాడు జరగబోయే కేబినేట్ అజెండాలో ఉండనున్న ఈ అంశం కార్యరూపం సిద్ధిస్తే… రాష్ట్రంలో ‘ప్రత్యేక హోదా’ విషయంలో చంద్రబాబు చెప్పుకోవడానికి ఏదొకటి ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. అలాగే హోదా విషయంలో రాజకీయ లబ్ది కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోన్న వైసీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలకు కూడా గట్టిగా బదులిచ్చినట్లు అవుతుంది, ఇంకా చెప్పాలంటే హోదా గురించి మాట్లాడితే ఎదురుదాడి చేసే అవకాశం దక్కుతుంది. దీంతో ఈ కీలక ఘట్టం కోసం చంద్రబాబు సర్కార్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చివరి నిముషంలో ఎలాంటి ట్విస్ట్ లు లేకుండా కేంద్రం ‘ప్రత్యేక ప్యాకేజ్’కు చట్టబద్ధత కల్పిస్తుందని ఆశిద్దాం.



