చంద్రబాబుకి మరో ట్రైనీ… గురుదక్షిణ ఎలా ఉంటుందో?

chandrababu-naidu-pawan-kalyan-nara-lokesh-naga-babu

ఏపీ, తెలంగాణ రాజకీయాలలో అత్యంత సీనియర్ చంద్రబాబు నాయుడు. అటు రాజకీయాలలో, ఇటు పాలనలో సాటి లేదనిపించుకున్నారు. కేసీఆర్‌, రేవంత్ రెడ్డితో సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయన శిష్యులే.

ADVERTISEMENT

ఆయన వద్ద రాజకీయాలు, పాలనా వ్యవహారాలు నేర్చుకున్నవారు అందరూ రాణించారు. కానీ వారిలో కేసీఆర్‌ వంటి కొందరు ఆయనని రాజకీయంగా దెబ్బ తీశారు. దాని వలన చంద్రబాబు నాయుడు కొంత నష్టపోయినా ధైర్యంగా పోరాడి మళ్ళీ నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు కేంద్రంలో కీలకంగా నిలుస్తున్నారు.

ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ చంద్రబాబు నాయుడు వద్ద శిష్యరికం చేస్తున్నారు. కాస్త ఆవేశం, నోటి దురుసుతనం ఉన్న నాగబాబు కూడా త్వరలో చేరబోతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు వద్ద మరో రాజకీయ ట్రైనీ జాయిన్ అవుతున్నారన్న మాట!

పవన్ కళ్యాణ్‌ ఎన్నికల సమయంలో చాలా రాజకీయ పరిణతి ప్రదర్శించారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి, మంత్రి పదవులు చేపట్టిన తర్వాత కూడా సిఎం చంద్రబాబు నాయుడు పట్ల మరింత గౌరవంగా, స్నేహంగా వ్యవహరిస్తున్నారు.

చంద్రబాబు నాయుడు నుంచి పాలనా వ్యవహారాలను కూడా నేర్చుకుంటూ తన సమర్థత నిరూపించుకునేందుకు గట్టిగా కృషి చేస్తున్నారు. రాబోయే నాలుగున్నరేళ్ళపాటు పవన్ కళ్యాణ్‌, నాగబాబు ఇద్దరూ కూడా ఇదే విదంగా వ్యవహరిస్తే తప్పకుండా ప్రజలలో మంచి పేరు సంపాదించుకుంటారు.

రాష్ట్రంలో జనసేన అధికారంలోకి వచ్చింది కనుక రాబోయే నాలుగున్నరేళ్ళలో జనసేన కూడా బలపడుతుంది. కనుక అప్పుడు మెగా బ్రదర్స్ సొంత కాళ్ళ మీద నిలబడాలనుకోవడం సహజం.

చంద్రబాబు నాయుడు ఎల్లప్పటికీ ముఖ్యమంత్రిగా ఉండలేరు. కనుక భవిష్యత్‌లో నారా లోకేష్‌ లేదా పవన్ కళ్యాణ్‌లలో ఎవరో ఒకరికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించవచ్చు. కానీ ముఖ్యమంత్రి పదవి కోసం టీడీపీ, జనసేనల పొత్తులు, సఖ్యతని పణంగా పెట్టకుండా కలిసిమెలిసి ముందుకు సాగాల్సి ఉంటుంది. అదే చంద్రబాబు నాయుడుకి మెగా బ్రదర్స్, నారా లోకేష్‌ ఇచ్చే గురుదక్షిణ.

ADVERTISEMENT
Latest Stories