మరో వారంలో 2023 ముగిసి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. ఈ ఏడాది ఏపీ రాజకీయాలను ఓసారి రీవైండ్ చేసి చూస్తే, నలుగురు ప్రధానంగా కనిపిస్తారు. జగన్, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్. ఈ నలుగురూ రాష్ట్ర రాజకీయాలను గతంలో కనీవినీ ఎరుగనంతగా ప్రభావితం చేశారు. వీరిలో జగన్మోహన్ రెడ్డి గురించి ఇప్పటికే చెప్పుకొన్నాము. ఇప్పుడు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గురించి చెప్పుకొందాము.
చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారిగా 53 రోజులు జైలులో గడపడంతో 2023 సంవత్సరం ఆయనకు, కుటుంబ సభ్యులకు, టిడిపికి కూడా ఓ భయంకరమైన చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఒకానొక దశలో టిడిపి పని అయిపోయిందనే అందరూ అనుకొన్నారు. కానీ చివరికి ఆయనే గెలిచారు.
జగన్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆయనపై అవినీతిపరుడని ముద్రవేయాలనుకొంటే న్యాయస్థానాలు ఆ ఆరోపణళ్ను కొట్టిపడేస్తున్నాయి. తద్వారా తనపై రాజకీయకక్షతోనే జగన్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందనే ఆయన వాదన నిజమని ప్రజలు కూడా గ్రహించారు.
ఎన్నికల వరకు ఆయనను జైల్లో నిర్బందించి ఉంచాలనుకొంటే బయటకు వచ్చేశారు. జైల్లో చంద్రబాబు నాయుడు మానసికంగా, శారీరికంగా క్రుంగిపోయి బలహీనపడతారనుకొంటే బయటకు రాగానే ఎప్పటిలాగే ఉత్సాహంగా రాజకీయాలలో పాల్గొంటున్నారు.
గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన ప్రభుత్వం చేసుకొన్న అభివృద్ధి పనుల గురించి ప్రజలకు గట్టిగా చెప్పుకోలేదు. కానీ ఒక్క స్కిల్ డెవలప్మెంట్ కేసుతో ఆయన చేపట్టిన అభివృద్ధి పనుల గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించి ఆయన ప్రతిష్టని దెబ్బతీయాలనుకొంటే మరింత పెరిగింది.
దేశవిదేశాలలో తెలుగు ప్రజలు ఆయన అరెస్టుని ఖండించడంతో ఆయన పాపులారిటీ ఏమిటో జగన్తో సహా అందరికీ అర్దమైంది. ఆయన అరెస్టు కారణంగానే టిడిపి మరింత బలపడింది. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరింత రాటుతేలారు.
చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళి చాలా ఇబ్బందులు పడినప్పటికీ ప్రజలలో ఆయన పట్ల సానుభూతి పెరిగింది. అది రాబోయే ఎన్నికలలో ఓట్ల రూపంలోకి మారితే టిడిపి, జనసేనల విజయానికి అదే పునాది అవుతుంది. కనుక ఈ ఏడాది ఆయన మోస్ట్ పాపులర్ పొలిటీషియన్గా చంద్రబాబు నాయుడు నిలిచారని చెప్పక తప్పదు.
ఈ వయసులో కూడా ఆయన టిడిపిని హుషారుగా నడిపిస్తున్న తీరు చాలా ప్రశంశనీయం. నిజానికి పార్టీలో నారా లోకేష్తో సహా అంత మంది సీనియర్ నేతలున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇంతగా శ్రమపడవలసిన అవసరమే లేదు. పార్టీ కార్యాలయంలో కూర్చోనే పార్టీని నడిపించవచ్చు.
కానీ అధికారంలో ఉన్నా లేకపోయినా నిరంతరం పనిచేస్తూ, ప్రజల మద్యన ఉండే మంచి అలవాటు కారణంగా చంద్రబాబు నాయుడు, జైల్లో ఉన్న ఆ 53 రోజులు తప్ప మిగిలిన కాలమంతా ప్రజల మద్యనే ఉన్నారు. ప్రజా సమస్యలపై జగన్ ప్రభుత్వంతో ధైర్యంగా పోరాడుతూనే ఉన్నారు.
చంద్రబాబు నాయుడుకి లభిస్తున్న జనాధరణ సిఎం జగన్మోహన్ రెడ్డికి కూడా లభించడం లేదంటే అతిశయోక్తి కాదు. చంద్రబాబు సభలు, రోడ్ షోలకు జనాలు స్వచ్ఛందంగా తరలివస్తుంటారు. అదే జగన్ బటన్ సభలకు వాలంటీర్ల చేత లబ్ధిదారులను బలవంతంగా రప్పించుకోవలసివస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
కనుక నేటికీ ప్రజలు చంద్రబాబు నాయుడు నాయకత్వంపై చాలా నమ్మకం పెట్టుకొన్నారని స్పష్టం అవుతోంది. 2023లో ఆయన ఎదుర్కొన్న ఈ చేదు అనుభవం, 2024లో టిడిపికి మేలు చేస్తుందా లేదా? చంద్రబాబు నాయుడు మళ్ళీ మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టి పూర్వ వైభవం సాధిస్తారా లేదా?అనేది మరో 4-5 నెలల్లో అందరూ చూస్తారు.




