విభజన సందర్భంగా జరిగిన పరిణామాలు దాదాపుగా అందరికీ తెలిసినవే. అది తలచుకున్నప్పుడల్లా ఒకింత విషాదం, కాంగ్రెస్ పై కోపం, బిజెపిపై విరక్తి కలగడం సర్వసాధారణమే. ఈ విషయాలను గత రెండేళ్ళుగా ఎన్నో సందర్భాలలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రస్తావించారు. తాజాగా కూడా ఇదే అంశాలను ప్రస్తావిస్తూ తన ఆవేదననంతా మరోసారి బయటపెట్టారు. అయితే ఇన్ని సార్లు చెప్పడాన్ని కూడా సమర్ధించే విధంగా… తన ఆవేదన అలాంటిదని మరోసారి మీడియా వేదికగా మనసు విప్పారు చంద్రబాబు.
సోనియా గాంధీ పుట్టిన రోజున రాష్ట్రాన్ని విడగొడతామని చెప్పారు. ఇటలీ ఇండిపెండెన్స్ డే రోజున నోటిఫికేషన్ ఇచ్చారు. వార్ రూం ఏర్పాటు చేసి, చర్చలు జరిపి, యుద్ధ విమానంలో బిల్లు పంపారు. పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్ర విభజన చేసారు. ఆనాడు విభజన సమస్యలపై ఎనిమిది పేపర్లు పబ్లిష్ చేశాను. ఆ సమయంలో ఢిల్లీలో ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేశాను. దీక్ష సమయంలో ప్రముఖ జర్నలిస్టు కరణ్ ధాపర్ పలుమార్లు… నువ్వు ఎప్పుడు పొట్టి శ్రీరాములు అవుతావని ప్రశ్నించారు. నేను నిరాహార దీక్షలో ఉంటే… జైలు నుంచి వైఎస్సార్సీపీ అధినేత జగన్ బిల్లుకు మద్దతిచ్చి, విడుదలై ఊరేగింపుగా బయటకు వచ్చాడు.
ఇవన్నీ కుట్రలు కాదా? రాజకీయ లబ్ధి అన్న కుతంత్రంతో విభజన బిల్లు తీసుకురాలేదా? అది తలచుకున్న ప్రతి సారి బాధ కలుగుతుంది. వాటి నుంచి ఎలాగైనా కోలుకోవాలని నవ నిర్మాణ దీక్ష చేపట్టాను, నవ సంకల్ప దీక్ష చేపట్టాను. మీరు చేసిన తప్పుడు విధానం వల్ల పంజాబ్ లో తీవ్రవాదం పుట్టుకొచ్చిందని ఆ రోజే నేను చెబితే, ప్రజలను హ్యూమిలియేట్ చేస్తున్నారా? అని అన్ని పార్టీల వాళ్లు విమర్శలు చేశారు. ‘అది కాదు, అసంబద్ధ విభజన ద్వారా ప్రజల్లో విద్వేషాలు రేపుతున్నారు మీరు’ అని ఆ రోజే చెప్పాను. ‘కట్టుబట్టలతో రాష్ట్రాన్ని నడి రోడ్డుపై నిలబెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విభజన జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. ప్రమాదం జరుగుతుందని భావించిన రోజున రోడ్డెక్కారు. ఎవరికి తోచిన విధంగా వారు నిరసన తెలిపారు.
బిల్లు ఆమోదం పొందగానే ప్రజలంతా నిరాశకు లోనయ్యారు. దీంతో మా పరిస్ధితి ఏంటి… 60 ఏళ్లు హైదరాబాద్ లో పెట్టిన పెట్టుబడులు రావు, భవిష్యత్ తరాలు ఇబ్బందుల్లో పడతాయని అందరూ ఆవేదన చెందారు. అలాంటి సమయాల్లో ప్రజలందర్నీ పాజిటివిటీ వైపు మరల్చడానికి చాలా కష్టపడ్డాను. కావాలంటే నా ప్రసంగాలన్నీ చూసుకోండి. ఇలా విభజించి తమ భవిష్యత్ లపై నిప్పులు పోశారని ప్రజలు బాధపడుతూ, తమకు, తమ ఆందోళనలకు, నిరసనలకు, తమ గొంతుకు విలువ లేనప్పుడు ఈ దేశంలో ఉండాల్సిన అవసరం ఏంటని చాలా మంది నన్ను ప్రశ్నించారు. అది సరికాదని వారికి నేను హితవు పలికాను.
తలుపులన్నీ మూసేసి, లోక్ సభలో అరగంటలో బిల్లు పాస్ చేశారు. దీంతో వివిధ పార్టీలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన నేను పూర్తిగా నిరాశకు లోనై ఆ సాయంత్రమే హైదరాబాదు వచ్చేశాను. సిక్స్ పాయింట్ పార్ములాను అమలు చేశారు. ఇలా ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం గురించి వివరిస్తూ… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు.



