బిజెపికి గుజరాత్ ఎలాంటిదో వైసీపీకి కడప కూడా అలాంటి కంచుకోటే. అక్కడ వైసీపీ తప్ప మరో పార్టీ కన్నెత్తిచూడలేని పరిస్థితి. ఇక జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల చెప్పన్నక్కర లేదు. ప్రతిపక్ష నేతలు అక్కడ అడుగుపెట్టాలంటేనే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవలసి ఉంటుంది.
అలాంటి కడప కంచుకోటలో పులివెందుల-జగన్ అడ్డాలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అడుగుపెట్టడమే కాకుండా “ఈ ముఖ్యమంత్రి ఓ సైకో… సొంత బాబాయ్ని చంపించిన కిరాతకుడు… సొంత తల్లిని, చెల్లిని బయటకు గెంటేసిన దుర్మార్గుడు… పరిపాలన గురించి కనీస అవగాహన లేకుండా రాష్ట్రాన్ని అన్ని విదాలా భ్రష్టు పట్టించేస్తున్న అసమర్ధుడు, అవినీతిపరుడు… అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
‘సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ పేరుతో రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటన మొదలుపెట్టారు. దానిలో భాగంగానే నిన్న పులివెందులలో అడుగుపెట్టినప్పుడు ఆయనకు స్వాగతం పలికేందుకు వేలాదిమంది ప్రజలు తరలివచ్చారు.
పట్టణంలో పూల అంగళ్ళ సెంటర్ వద్ద చంద్రబాబు నాయుడి బహిరంగసభ జనాలతో కిక్కిరిసిపోయింది. సభకు వచ్చిన జనాలతో పట్టణంలో రోడ్లన్నీ నిండిపోయాయి. చుట్టుపక్కల భవనాలపై కూడా జనాలతో నిండిపోయాయి.
జగన్ సొంత నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు సభకు ఇసుకవేస్తే రాలనంతగా వేలాదిమంది జనం తరలిరావడం చూస్తే, అక్కడి ప్రజలు కూడా జగన్ పాలనతో ఎంతగా విసుగెత్తిపోయున్నారో అర్దమవుతోంది. వారు కూడా మార్పు కోరుకొంటున్నారని అర్దమవుతోంది. అందుకే చంద్రబాబు నాయుడు “మీ అందరినీ చూస్తుంటే తిరుగుబాటు మొదలైనట్లు అనిపిస్తోందని” అన్నారు.
“సొంత తల్లిని, చెల్లినే గౌరవించని ఈ ముఖ్యమంత్రి తనను గౌరవిస్తాడని అనుకోవడంలేదు. నాకు వయసు అయిపోయిందని ముసలోడు… అంటూ జగన్ అవహేళన చేస్తున్నాడని, కానీ నాకు వయసు ఓ నంబర్ మాత్రమే అని… సింహం ఎప్పటికీ సింహమే” అంటూ చంద్రబాబు నాయుడు కొదమ సింహంలా గర్జించారు.
‘పులివెందుల పులి సునీతారెడ్డి ఒంటరిగా న్యాయపోరాటం చేస్తుంటే, ఆమె తండ్రిని చంపించిన అవినాష్ రెడ్డిని పక్కనపెట్టుకొని జగన్ కాపాడుతున్నాడని’ చంద్రబాబు నాయుడు ఆక్షేపించారు. వివేకా హత్య, కోడికత్తివంటి క్రిమినల్ కేసులతో జగన్ ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చాడని చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
పులివెందులలో చంద్రబాబు నాయుడు పర్యటించడం, దానికి ఇంతగా జనాలు తరలిరావడం రెండూ విశేషమైనవే.
చంద్రబాబు నాయుడు పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ, అక్కడ పర్యటించి, జగన్పై తీవ్ర విమర్శలు గిప్పించి తనను ఏ శక్తి అడ్డుకోలేదని, తాను ఎవరికీ భయపడేవాడినికానని ప్రజలకు, పార్టీ క్యాడర్కు నిరూపించి చూపారు.
ఎన్నికలకు ముందు నేతలు పార్టీలు మారడం సహజమే కానీ పులివెందులలో చంద్రబాబు నాయుడు సభకి వేలాదిగా జనాలు తరలిరావడం గమనిస్తే, ఇంతకాలం వైసీపీ అరాచకపాలనను చాలా ఓపికగా భరించిన పులివెందుల ప్రజలు కూడా ఇప్పుడు బయటకు వచ్చి బహిరంగంగా జగన్ ప్రభుత్వానికి తమ వ్యతిరేకతను తెలియజేస్తున్నట్లు అర్దమవుతోంది.
వైసీపీ ‘కంచుకోట కడప’ జిల్లా, జగన్ అడ్డా- పులివెందులలో ప్రజలే ఇంతగా వ్యతిరేకిస్తున్నప్పుడు, ఇక రాష్ట్రంలో మిగిలిన జిల్లాలలో ప్రజలు మిన్నకుంటారా? పులివెందులలో చంద్రబాబు నాయుడు బహిరంగసభలో విజయవంతం అవడం వైసీపీ పతనానికి ప్రారంభాన్ని సూచిస్తున్నట్లే ఉంది.



