టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు ప్రతీరోజూ వార్తల్లో సుప్రీంకోర్టులో ఆయన వేసిన క్వాష్ పిటిషన్ గురించే మీడియాలో వార్తలు వస్తుండేవి. ముఖ్యంగా ఆ కేసులో సెక్షన్ 17ఏపై సుదీర్గంగా వాదనలు జరిగాయి. చివరికి ఆ కేసులో చంద్రబాబు నాయుడు వేసిన క్వాష్ పిటిషన్పై తీర్పుని రిజర్వ్ చేస్తున్నట్లు అక్టోబర్ 17న సుప్రీంకోర్టు ప్రకటించింది.
కనుక వారం పదిరోజులలోగా తీర్పు వెల్లడిస్తుందని అందరూ భావించగా రెండు నెలలైనప్పటికీ ఇంతవరకు తీర్పు వెల్లడించలేదు. కానీ బెయిల్పై ఉన్న ఆయనకు రాజకీయ సభలు, సమావేశాలలో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు అనుమతించడంతో, ఆయన రాజకీయాలలో మళ్ళీ యాక్టివ్గా అయ్యారు. ఈ కారణంగా సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ సంగతి దాదాపు అందరూ మరిచిపోయారనే చెప్పవచ్చు.
చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు కూడా సుప్రీంకోర్టు రిజర్వ్ చేసిన తీర్పు గురించి తొందరపడకపోవడం గమనిస్తే, తీర్పు ఆయనకు సానుకూలంగా ఉంటుందనే నమ్మకంతోనే కావచ్చు. కానీ వర్తమాన రాజకీయాలలో ఏ కేసులైనా అధికార పార్టీకి జమ్మి చెట్టు మీద పాండవులు దాచి పెట్టిన అస్త్ర శాస్త్రాలవంటివే. అవసరమైనప్పుడు వాటిని కిందకు దించి ప్రత్యర్ధులపై ప్రయోగిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
కనుక త్వరలో జరుగబోయే శాసనసభ, లోక్సభ ఎన్నికలకు ముందే సుప్రీంకోర్టులోని ఈ కేసుతో సహా అన్ని కేసుల నుంచి చంద్రబాబు నాయుడుకి విముక్తి లభిస్తే వ్యక్తిగతంగా ఆయనకు, రాజకీయంగా టిడిపికి కూడా చాలా మంచిది.




