వైసీపీ నేతల దాడిలో కంటికి తీవ్ర గాయమై ప్రస్తుతం హైదరాబాద్లో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విజయవాడ మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “వైసీపీ ప్రభుత్వం అరాచకాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. రాష్ట్రాన్ని పాలించమని ప్రజలు అధికారం అప్పగిస్తే ప్రతిపక్ష నేతలపై దాడులు చేస్తూ రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ఓడిపోతామనే భయంతోనే వైసీపీ నాయకులు ఇంత నీచానికి దిగజారుతున్నారు. ఎదుటవారిపై ఈవిదంగా భౌతిక దాడులు చేసి భయపెడదామని ప్రయత్నిన్నారు. ఒకవేళ మీ కుటుంబాలకే ఇటువంటి పరిస్థితి ఎదురైతే ఎలా ఉంటుందో ఊహించుకోండి. గత ఏడాది పట్టాభిపై దాడి జరిగినప్పుడే మేము ఖండనలతో సరిపెట్టాము. ఆనాడే మేము కోర్టుకు వెళ్ళి చట్టపరంగా చర్యలు తీసుకొని ఉండి ఉంటే నేడు వైసీపీ నాయకులు ఇంతగా రెచ్చిపోయుండేవారు కారు. కానీ అప్పుడు ఉపేక్షించడం మా పొరపాటే. ఈసారి మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదు. కోర్టుని ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తాము. ఈ కేసులో దోషులకు శిక్ష పడేలా చేస్తాము.
మేము కేవలం వైసీపీ ప్రభుత్వ విధానాలు, అవినీతి, అన్యాయాలపైనే పోరాడుతున్నాము తప్ప మాకు సొంత అజెండాలు ఏవీలేవు. వైసీపీ అరాచకాలను ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. వైసీపీ గూండాలు బహిరంగంగా ప్రతిపక్ష నేతలపై దాడులు చేస్తుంటే వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవలసిన విజయవాడ పోలీస్ కమీషనర్ వారిని వెనకేసుకువస్తూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాకు అన్యాయం చేస్తున్న ప్రతీ ఒక్క అధికారిని మేము గుర్తుపెట్టుకొని మేము అధికారంలోకి వచ్చాక వారందరిపై చర్యలు తీసుకొంటాము. వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయని గ్రహించినందునే వైసీపీ గూండాలు ఈవిదంగా చెలరేగిపోతున్నారు. కానీ హత్యారాజకీయాలతో మమ్మల్ని ఎవరూ భయపెట్టలేరు. చివరి వరకు మేము పోరాడుతూనే ఉంటాము. మళ్ళీ ఇటువంటి ఘటన మరోసారి జరిగిందంటే తగిన విదంగా జవాబిస్తాము,” అని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.



