నవ్యాంధ్రకు పెట్టుబడులను రాబట్టడమే లక్ష్యంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న విదేశీ పర్యటనలు ఆంధ్రప్రదేశ్ కు సానుకూల ఫలితాలను ఇస్తుండడంతో తాజాగా మరో దేశంపై పెట్టుబడుల ‘దండయాత్ర’ చేసేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఇటీవలే చైనాలో ఐదు రోజుల పాటు పర్యటించి వచ్చిన చంద్రబాబు… త్వరలోనే వేలాది కోట్ల మేర పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నట్లు అధికారిక వివరాలతో సహా తెలిపిన విషయం తెలిసిందే.
తాజాగా మరో కీలక దేశం రష్యాలో పర్యటించేందుకు ఈ నెల 9వ తేదీన పయనమవ్వడానికి సిద్ధమవుతున్నారు. ‘ఇండస్ట్రియల్ నెట్’ థీమ్ తో రష్యాలో జరగనున్న అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిర్ ‘ఇన్నోప్రోమ్-2016’ లో పాల్గొనాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ నెల 10 నుంచి 14 వరకు రష్యా నగరం ఎకతెరిన్ బర్గ్ లో జరగనున్న ఈ సదస్సుకు చంద్రబాబుతో పాటు మహారాష్ట్ర, రాజస్థాన్ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, వసుంధర రాజేలు కూడా హాజరు కానున్నారు.
దేశంలోని ఇద్దరు ఇతర ముఖ్యమంత్రులు హాజరు అవుతున్నప్పటికీ, ఈ ట్రేడ్ ఫెయిర్ కు ఏపీనే కంట్రీ పార్టనర్ గా వ్యవహరిస్తోంది. ఈ సదస్సు కోసం చంద్రబాబు ఈ నెల 9వ తేదీన రష్యా విమానం ఎక్కనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రష్యా ప్రధాని మెద్వెదేవ్, ఆ దేశ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి, ఎకతెరిన్ బర్గ్ గవర్నర్లు తదితరులతో చంద్రబాబు భేటీ అయ్యి, ఏపీలో పెట్టుబడుల అవకాశాలపై కీలక చర్చలు జరపనున్నారు.



