టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నేటి నుండి మూడు రోజులు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం పెదకూరపాడులో, బుదవారం సత్తెనపల్లిలో, గురువారం తాడికొండలో చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. కనుక టిడిపి నేతలు ఆయనకు స్వాగతం చెపుతూ ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేశారు.
సరిగ్గా వాటికి ఎదురుగానే చంద్రబాబు నాయుడుని విమర్శిస్తూ వైసీపీ నేతలు కూడా ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేస్తుండటంతో రెండు పార్టీల మద్య తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్నాయి. టిడిపి శ్రేణులను రెచ్చగోట్టేందుకు వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడుని విమర్శిస్తూ ఫ్లెక్సీ బ్యానర్లు పెడుతున్నప్పటికీ పోలీసులు వారిని అడ్డుకొనే ప్రయత్నం చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కనుక తీవ్ర ఉద్రిక్త పరిస్థితులలో నేడు చంద్రబాబు నాయుడు పర్యటన ప్రారంభం కాబోతోంది.
మొదట్లో ప్రతిపక్షనేతలను వైసీపీ నేతలు, కార్యకర్తలతో అడ్డుకొనే ప్రయత్నంచేస్తే, వైసీపీ పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరగడంతో పాటు కోర్టులలో ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశ్యంతోనే వైసీపీ ప్రభుత్వం జీవో నంబర్:1 తెచ్చిన్నట్లు భావించవచ్చు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ తదితరులను పోలీసులు అడ్డుకొన్నప్పుడు వారు ధిక్కరించి సభలు, ర్యాలీలు, రోడ్ షోలను నిర్వహిస్తే అప్పుడు వారిపై కేసులు నమోదు చేయడం సులువవుతుంది. అంటే వైసీపీ చేతికి మట్టి అంటకుండా పని కానిచ్చేయడం అనుకోవచ్చు. కానీ జీవో నంబర్:1పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలవుతుండటంతో వైసీపీ ప్రభుత్వం దాని అమలుపై కూడా వెనకడుగువేయక తప్పడం లేదు. కనుక మళ్ళీ వైసీపీ నేతలు, కార్యకర్తలు రంగంలో దింపుతున్నట్లు భావించవచ్చు.
వైసీపీ శ్రేణులు బరిలో దిగితే ఏమవుతుందో మొన్న ఎర్రగొండపాలెంలో అందరూ చూశారు. కనుక ఈ మూడు రోజుల చంద్రబాబు నాయుడు పర్యటనలో ఏ క్షణంలో ఏమవుతుందో తెలీని పరిస్థితి కనిపిస్తోంది. టిడిపి అమరావతి రాజధానికి కట్టుబడి ఉండగా, వైసీపీ దానిని వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం చంద్రబాబు నాయుడు అమరావతి చేరుకొని అక్కడ రైతులను ఉద్దేశ్యించి ప్రసంగించబోతున్నారు. కనుక రెండు పార్టీల మద్య ఘర్షణ అనివార్యంగా కనిపిస్తోంది.
టిడిపి మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ జిల్లా ఎస్పీని కలిసి చంద్రబాబు నాయుడు పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భద్రత కట్టుదిట్టం చేయాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చారు. ఈ పరిస్థితులను చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు జిల్లాలలో పర్యటించాలంటే ఇంత ప్రమాదకరమా? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కంటే ఫ్యాక్షనిజమే ఎక్కువగా కనిపిస్తోందని అనిపించకమానదు.



