
కాకినాడ పోర్టు నుంచి వేల టన్నుల రేషన్ బియ్యం ఆఫ్రికా దేశాలకు ఎగుమతి… మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం అర్దరాత్రి అగ్నిప్రమాదంలో కీలకమైన ఫైళ్ళు, ఆ వివరాలు కలిగి ఉన్న కంప్యూటర్లు కాళి బూడిద అవడం వేర్వేరు ఘటనలు కావచ్చు.
కానీ ఈ రెంటినీ కలిపి చూస్తే ఓ విషయం అర్దమవుతుంది. రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, వైసీపి నేతలతో ప్రభుత్వ శాఖలలోని కొందరు అధికారులు, ఉద్యోగులు అంటకాగుతున్నారని. వారి సాయంతో వైసీపి నేతలు యధేచ్చగా ఇటువంటి పనులకు తెగబడుతున్నారని!
Also Read – కొండా సురేఖ: అలవాటులో పొరపాటా.?
లేకుంటే టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉండగా రేషన్ షాపులకు చేరాల్సిన బియ్యం, కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్, ఆయన బినామీల గోదాములకు ఎలా చేరగలుగుతుంది?ఆయన గోదాములలో వేల టన్నుల రేషన్ బియ్యం ఉందని తెలిసినా పౌరసరఫరాల శాఖ అధికారులు చూసి చూడన్నట్లు ఎందుకు ఊరుకున్నారు? ప్రభుత్వ, పోర్టు అధికారుల సహకారం లేకపోతే ఆ బియ్యం కాకినాడ నుంచి ఆఫ్రికా దేశాలకు ఎలా ఎగుమతి చేయగలుగుతారు?
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం రాత్రి 10.30 గంటల వరకు గౌతమ్ అనే ఓ ఉద్యోగి ఉన్నాడని జిల్లా కలెక్టర్ చెప్పారు. అతను బయటకు వచ్చేసిన గంటలోగానే కార్యాలయంలో మంటలు చెలరేగాయి. వాటిలో కీలక ఫైళ్ళన్నీ తగులబడిపోయాయని డిజిపి ద్వారకా తిరుమల రావు, సీఐడీ అధిపతి రవిశంకర్ అయ్యనార్ చెప్పారు.
Also Read – వివేకా కేసులో ఇదే తీర్పు ఇచ్చి ఉంటే..
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి భూభాగోతాలకు సంబందించిన ఫైళ్ళు, కంప్యూటర్లు బూడిదయ్యాయని ప్రాధమిక దర్యాప్తులో తేలింది.
ఈ రెండు ఘటనలను కలిపి చూస్తే నేటికీ కొందరు అధికారులు, ఉద్యోగులు వైసీపి నేతలతో అంటకాగుతున్నారని, వారి ద్వారానే ఇటువంటివన్నీ చేయగలుగుతున్నారని స్పష్టం అవుతోంది.
Also Read – ఓ అందగాడు ఇక్కడ.. మరొకడు ఎక్కడా?
రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిన్న మొన్నటి వరకు కూడా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీలు చేస్తూనే ఉంది. అయినా ఇంకా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయంటే, ప్రభుత్వంలో వైసీపి కోవర్టులు ఇంకా చాలా మందే ఉన్నారని ప్రభుత్వం వారిని గుర్తించి కట్టడి చేయలేకపోయిందని స్పష్టమవుతోంది.
ప్రభుత్వం పరిపాలన, అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన సమయంలో ఇటువంటి అంతర్గత కుట్రలు, దొంగతనాలను కాసుకోవలసివస్తుండటం చాలా బాధాకరమే.
వైసీపి అరాచక పాలన కారణంగానే అధికారం కోల్పోయినప్పటికీ దాని దురాగతాలు మానుకోకపోవడం, ఇటువంటి పనులలో వైసీపి నేతలకు సహకరిస్తే తాము ప్రమాదంలో పడతామని తెలిసినా కొందరు అధికారులు, ఉద్యోగులు వారికి సహకరిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
కాకినాడ, మదనపల్లె ఘటనలు రెండూ టిడిపి కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేవే. కనుక ఇకనైనా సిఎం చంద్రబాబు నాయుడు, సంబందిత శాఖల మంత్రులు తమ ప్రభుత్వంలో వైసీపి కోవర్టులను గుర్తించి ఏరి పారేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా ఉపేక్షిస్తే ఇంటి గుట్టు లంకకు చేటు తెచ్చిన్నట్లు ప్రభుత్వానికి తీరని నష్టం కలిగించే ప్రమాదం ఉంటుంది.
—