2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం మొట్టమొదటి సారిగా పార్టీ పరంగా ఒక బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. గత నాలుగేళ్లుగా ప్రభుత్వపరంగా నిర్వహిస్తున్న సభల్లోనే ముఖ్యమంత్రి పాల్గొంటూ ప్రసంగిస్తున్నారు. అప్పుడప్పుడు నవ నిర్మాణ దీక్ష, పార్టీ కార్యక్రమాలు చేపట్టినా పార్టీ పరంగా బహిరంగ సభలు లేవు.
తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ చేపట్టే అన్ని కార్యక్రమాలకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఆ క్రమంలో కేంద్రంపై పోరాటానికి తిరుపతినే వేదికగా ఎంచుకున్నారని అవగతమవుతోంది. ఈ సభ తర్వాత రాష్ట్రంలోని మిగతా 12 జిల్లాల్లోనూ సభలు నిర్వహించే యోచనలో పార్టీ ఉందని సమాచారం.
ఇది ఓ రకంగా రానున్న ఎన్నికలకు శంఖారావంగా విశ్లేషిస్తున్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 30న ఇదే వేదికగా ప్రత్యేక హోదాసహా అనేక హామీలు ఇచ్చిన ప్రధాని మోడీ ఎన్నికల తర్వాత నాలుగేళ్లు పూర్తయినా నాటి హామీల్లో ఒక్కటీ పూర్తి స్థాయిలో నెరవేర్చలేదని, రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొంటూ తిరుపతి సభా వేదికగా ప్రజలకు వెల్లడించనున్నారు చంద్రబాబు.



