టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం కుప్పంలోని మోడల్ కాలనీ, కృష్ణదాసనపల్లె, జరుగు, గుడ్లనాయుని పల్లెలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఉత్తర కొరియా దేశానికి కిమ్ అనే నియంత ఉన్నాడు. ఇక్కడ మనకి జగన్ అనేపేరుతో జూనియర్ కిమ్ ఉన్నాడు. ఆనాడు మనం బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం కోసం పోరాడాము. జగన్ పాలన బ్రిటిష్ వారి పాలన కంటే ఘోరంగా ఉంది. ఇప్పుడు జగన్ నుండి స్వాతంత్ర్యం కోసం పోరాడాలి.
ముప్పైమూడేళ్ళుగా కుప్పంకి ఎమ్మెల్యేగా ఉన్న నేను ఇక్కడ పర్యటిస్తుంటే వైసీపీ కార్యకర్తలతో మాపై దాడులు చేయించాడు. వైసీపీ కార్యకర్తలు మా పార్టీ ఫ్లెక్సీ బ్యానర్లను చించేశారు. ఇంకా దారుణమేమిటంటే కొంతమంది పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వచ్చి టిడిపి కార్యకర్తలపై దాడులు చేశారు.
నేను ఇక్కడ ఉండగానే వైసీపీ కార్యకర్తలు, పోలీసులు ఇంతగా రెచ్చిపోతున్నా జూనియర్ కిమ్, డిజిపి ఇద్దరూ పట్టించుకోలేదు. నేను అధికారంలో ఉన్నప్పుడు పోలీసులకు పూర్తి స్వేచ్చనిచ్చాను కానీ వారు ఏనాడూ ప్రతిపక్షాలపై ఈవిదంగా దాడులు చేయలేదు. ఒకవేళ ఆనాడు నేనే ఈవిదంగా ప్రవర్తించి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి కాలు బయటపెట్టగలిగి ఉండేవాడా?జగన్ అధికారంలో వచ్చాక కొంతమంది పోలీస్ ఉన్నతాధికారులు తమ బాధ్యతలను మరిచి వైసీపీకి ఊడిగం చేస్తున్నారు. కుప్పంలో టిడిపి కార్యకర్తలపై దాడులు చేసిన పోలీసులపై మేము త్వరలోనే న్యాయస్థానంలో ఓ ప్రైవేట్ కేసు వేస్తాము.
జగన్ ఆ కుర్చీలో నుంచి దిగిపోయేసరికి రాష్ట్రానికి సుమారు రూ.10 లక్షల కోట్లు అప్పు మిగిల్చిపోతాడు. అదీకాక మరో 25ఏళ్ళ వరకు రాష్ట్రంలో జరిగే మద్యం అమ్మకాలను చూపించి రూ.25,000 కోట్లు అప్పులు చేశాడు. ఇవన్నీ తీరాలంటే మరో పాతికేళ్ళు పడుతుంది.
ఇంతకాలం నేను పులివెందులపై దృష్టి పెట్టలేదు కనుకనే అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడు. ఇకనుంచి పులివెందులపై దృష్టి పెడతాను. పులివెందులలోనే జగన్ రెడ్డిని ఓడిస్తాను.
నాపై కక్షతో కుప్పంకు మంచినీళ్ళు అందించే హంద్రీనీవా కాలువ పనులను వైసీపీ ప్రభుత్వం ఆపించేసింది. కుప్పంలో పేద ప్రజల కోసం నేను కట్టిస్తున్న మూడువేల ఇళ్ళకు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకొంది. కుప్పం ప్రజలు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు. వారే మీకు తగినవిదంగా బుద్ధి చెపుతారు,” అని అన్నారు.



