టిడిపి అధినేత గురువారం కాకినాడ జిల్లా జగ్గంపేటలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమైనప్పుడు వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “టిడిపికి ఎల్లప్పుడూ కార్యకర్తల బలంతోనే నడుస్తోంది. పార్టీ కార్యకర్తలని కుటుంబ సభ్యులుగా భావిస్తూ వారికి జీవితభీమా కల్పించింది. కార్యకర్తలకి ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి టిడిపి సిద్దంగా ఉంటుంది. అయితే కార్యకర్తలు ఎప్పటికీ కార్యకర్తలుగా మిగిలిపోకూడదని నేను కోరుకొంటున్నాను. కార్యకర్తలలో నుంచే నాయకులు ఉద్భవించాలి. పార్టీలో ఉన్నతస్థాయికి ఎదగాలి. కనుక గతంలో ఉన్న పార్టీలో ఉన్న వ్యవస్థలకి భిన్నంగా ఈసారి నూతన విధానాలని రూపొందిస్తున్నాము. దాని ప్రకారం పార్టీలో ఉన్నతస్థాయికి ఎదిగేందుకు మంచి అవకాశం కలుగుతుంది. ఒకవేళ ఏ కారణం చేతైనా కార్యకర్తలు ఎడగలేకపోయినా వారి సేవలకి గుర్తింపుగా పంచాయతీ స్థాయిలో జరిగే అన్ని కార్యక్రమాలు, పనులలో వారికి ప్రాధాన్యం కల్పిస్తాము. పార్టీకి కార్యకర్తలు పునాది వంటివారు. పునాది ధృడంగాఉంటేనే ఎంత భవనమైన నిలబడగలుగుతుంది. కనుక టిడిపిలో కార్యకర్తల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచారణ అమలుచేస్తాము,” అని అన్నారు.
టిడిపి, వైసీపీల మద్య తేడాని వివరిస్తూ, “ఎవరికైనా టిడిపి అంటే టక్కున గుర్తొచ్చేది సంక్షేమం, అభివృద్ధే. అదే… వైసీపీని తలుచుకోగానే బ్లేడ్ బ్యాచ్, పేటీయం బ్యాచ్, కోడికత్తి, గొడ్డలివేటు, గంజాయి వ్యాపారాలు, మద్యం మాఫియా, ఇసుక మాఫియా, గ్రానైట్ మాఫియా, భూకబ్జాలు, నేతల బూతులే గుర్తుకువస్తాయి. టిడిపికి సంక్షేమం, అభివృద్ధి ఏవిదంగా ప్రతీకలుగా నిలుస్తాయో, అదేవిదంగా ఈ సకల అవలక్షణాలు వైసీపీకి చిహ్నాలుగా నిలుస్తాయి. ఈ వైసీపీ ప్రభుత్వానికి భవనాలు కూల్చడం, కొండలు మింగేయడం, గొరిగేయడం తప్ప మరోటి చేతకాదు. అసలు కొండలకి పరదాలు కప్పి దాచేయాలనే ఐడియా మనలాంటి వాళ్ళెవరికీ రాదు. జగన్మోహన్ రెడ్డికి మాత్రమే వస్తుంది.
ఆనాడు సమైక్య రాష్ట్రంలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ని అభివృద్ధి చేశాము. ఎన్నో ఐటి కంపెనీలని తీసుకువచ్చాము. మళ్ళీ ఏపీ విడిపోయిన తర్వాత హైదరాబాద్కి ధీటుగా అమరావతిని నిర్మించేందుకు పూనుకొన్నాను. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు గట్టిగా ప్రయత్నించాను. కానీ జగన్ వచ్చాక అమరావతి నిర్మాణపనులు నిలిచిపోయాయి. పోలవరం పనులు నిలిచిపోయాయి. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి కనబడటం లేదు. ఏపీ మళ్ళీ గాడిన పడాలంటే ఈ జగన్ రెడ్డి పోవాలి టిడిపి అధికారంలోకి రావాలి. తప్పదు,” అని అన్నారు.





