ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏవిదంగా అభివృధ్ది చెందాలో, అందుకోసం ఇప్పటి నుంచే ఏవిదంగా ముందుకు సాగాలో తెలియజేస్తూ కొన్ని వారాల క్రితం ‘విజన్ 2047 డాక్యుమెంట్’ ప్రకటించారు. ఓ రాష్ట్రాభివృద్ధికి ఇటువంటి నిర్ధిష్టమైన లక్ష్యం, అందుకు ప్రణాళికలు, వాటి ప్రకారం కార్యాచరణ చాలా అవసరం.
జగన్ 5 ఏళ్ళ విధ్వంసం, రాక్షస పాలన చూసిన పారిశ్రామికవేత్తలు, “జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏమిటని’ అడగకుండా ఉండరు. కనుక ఎట్టి పరిస్థితిలో జగన్ మళ్ళీ అధికారంలోకి రారనే నమ్మకం కలిగించగలగాలి.
చంద్రబాబు నాయుడు ఈ ఏడు నెలలలోనే రాష్ట్రానికి సుమారు 2 లక్షల కోట్లుపైగా పెట్టుబడులు సాధించగలిగారు. అంటే పారిశ్రామికవేత్తలకు ఆ నమ్మకం కలిగించగలిగారని భావించాల్సి ఉంటుంది.
రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రావడం మొదలైంది. అమరావతి, పోలవరం పనులు మొదలయ్యాయి. పెద్ద ఎత్తున మౌలికవసతుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కనుక చంద్రబాబు నాయుడు కలలు కంటున్న ‘విజన్ 2047’ దిశగా తొలి అడుగులు పడిన్నట్లే భావించవచ్చు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఇంత దూరం ఆలోచించిన సిఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ భవిష్యత్ గురించి ఆలోచించకుండా ఉంటారా?అంటే కాదనే అర్దమవుతుంది.
ప్రస్తుతం టీడీపీ అధికారంలో ఉంది కనుక చాలా బలంగా ఉంది. కానీ 2029 ఎన్నికల నాటికి కూడా కూటమి ఇంతే బలంగా, ఐకమత్యంగా ఉంటుందా?ఒకవేళ ఉండకపోతే? టీడీపీ ఏం చేస్తుంది.. ఏం చేయాలి?
ఒకవేళ కూటమి ఇలాగే బలంగా, ఐకమత్యంగా ఉన్నప్పటికీ 2029 నాటికి చంద్రబాబు నాయుడుకి 79 ఏళ్ళు వస్తాయి. కనుక ఆయనే మరోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతారా?
ఒకవేళ కొనసాగదలచుకోకపోతే టీడీపీకి, కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారు?వంటి ప్రశ్నలు ఇప్పుడు చాలా అసందర్భంగా, చాలా ఎబ్బెట్టుగా అనిపించవచ్చు.
కానీ చంద్రబాబు నాయుడు ‘విజన్ 2047’ గురించి ఆలోచిస్తున్నప్పుడు అంతకంటే ముందు ‘టీడీపీ విజన్ 2029’ గురించి కూడా ఆలోచించి తదనుగుణంగా ఇప్పటి నుంచే పార్టీని, కూటమిని సిద్దం చేసుకోవడం చాలా అవసరమే కదా?




