గత ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు తన వల్లే గెలిచారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడినందుకే, పవన్ పై ఉత్తరాంధ్రలో వ్యతిరేకత ఏర్పడిందని మాజీ ఎంపీ సబ్బం హరి విమర్శించారు. ఓ ప్రముఖ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్తమాన రాజకీయాలపై తన ఆలోచనలను వెలిబుచ్చారు. 1983 నుంచి 2014 వరకు అశోక్ గజపతిరాజు గెలుస్తూ వస్తున్నారు. అప్పుడు కూడా అశోక్ గజపతిరాజును పవనే గెలిపించారా? టీడీపీలో క్రమశిక్షణ గల సీనియర్ నేత అశోక్ గజపతిరాజు అని తెలిపారు.
ఈ సందర్భంగా తాను ఏ పార్టీలో చేరే విషయం ఎన్నికల నాటికి చెబుతానని, 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని, టీడీపీలో చేరాలంటూ చంద్రబాబు రెండు సార్లు తనను ఆహ్వానించారని, అయినా తాను ఆ పార్టీలోకి వెళ్లలేదని అన్నారు. అదే విధంగా బీజేపీలో చేరమని వెంకయ్య నాయుడు కూడా తనను అడిగిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీని బతికించడం కోసమే వైసీపీ, జనసేన పార్టీలు కలుస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఎటువంటి అనుమానం లేదు. బీజేపీ చెప్పినట్టు ఈ రెండు పార్టీలు చేస్తాయనడానికి గత నెలరోజులుగా ఈ పార్టీల నేతలు చేస్తున్న ప్రసంగాలే నిదర్శనమని అన్నారు.
‘పవన్ కల్యాణ్ గారు మా పార్టీకి మద్దతిస్తానని నాకు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్ తో కలిసి పవన్ కలిసి పనిచేస్తారు’ అని వైసీపీ తిరుపతి మాజీ ఎంపీ వరప్రసాద్ గారు ఈ మధ్య ఓ ప్రకటన చేశారు కదా!’ అని గుర్తు చేసారు. ఏపీకి కేంద్రం అన్యాయం చేసిన కారణంగా ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకొచ్చిన తర్వాత ఏపీలో బీజేపీకి చాలా వ్యతిరేకత వచ్చిందని, చంద్రబాబు వాదనను ప్రజలందరూ అంగీకరించారని చెప్పారు. అదే సమయంలో, బీజేపీని, మోడీని… వైసీపీ, జనసేన పార్టీలు వ్యతిరేకించకపోవడాన్ని ప్రజలు స్పష్టంగా గమనించారని అన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి రాజకీయాలు నడిపిందో, ఈరోజున ఏపీలో బీజేపీ అలాంటి రాజకీయ క్రీడ నడపబోతోందనే విషయం రాజకీయ అనుభవం ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. ఏపీలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే.. వైఎస్ జగన్, పవన్ కల్యాణ్ కలిసి పనిచేస్తున్నారనే విషయం అందరికీ తెలుసని, రాబోయే రోజుల్లో ఈ విషయం మరింత స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు. ఎన్నికలకు ముందు ఎట్టిపరిస్థితుల్లోనూ వైసీపీ-బీజేపీ కలిసి పోటీ చేయవని, అదే, వైసీపీ-జనసేన కలిసి పోటీ చేసే వాతావరణాన్ని బీజేపీ సృష్టిస్తుందని అభిప్రాయపడ్డారు.
అలా జరిగినప్పుడు మాత్రమే, చంద్రబాబునాయుడిని ఎదుర్కోగలరనేది వారి అభిప్రాయమని, కొంతమేరకు ఆ అభిప్రాయం నిజమని అన్నారు. అయితే జగన్-పవన్ కలిసి పోటీ చేస్తే చంద్రబాబునాయుడి గెలుపు నల్లేరు మీద నడకే. కచ్చితంగా టీడీపీయే గెలుస్తుంది. కానీ, వైసీపీ-జనసేన కలిసి పోటీచేస్తే కొత్త వ్యూహాలకు టీడీపీ వెళ్లాల్సిన అవసరముంది. ఆ వ్యూహాలకు టీడీపీ రూపకల్పన చేస్తున్నట్టు తెలుస్తోంది అని చెప్పుకొచ్చారు. గత ఎన్నికలలో కూడా చివరి నిముషంలో తెలుగుదేశం పార్టీకి సబ్బం హరి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.



