కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపీ ముఖ్య నేతలందరిపై రాజకీయ కక్ష సాధింపులు మొదలైపోతాయని అందరూ భావించారు.
ముఖ్యంగా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి ‘అంకుశం సీన్’ తప్పదని అందరూ భావించారు. వివేకా హత్య కేసు విచారణ వేగవంతం అవుతుందని, నిందితులు అందరూ జైలుకి వెళ్ళిపోతారని అనుకున్నారు. కానీ వైసీపీ నేతలు భయపడినట్లు ఏమీ జరుగలేదు.
తిరుమల కల్తీ నెయ్యి కేసు, కల్తీ మద్యం కేసు, మద్యం కుంభకోణం కేసు, వివేకానంద హత్య కేసు, సోషల్ మీడియాలో దుష్ప్రచారం కేసుల విచారణలు, అరెస్టులు అన్నీరెండేళ్లుగా మొక్కుబడిగా సాగుతున్నాయి. ఆ కేసులలో వైసీపీ నేతలు ఇలా వెళ్ళి అలా బెయిల్పై బయటకు వచ్చేస్తున్నారు.
వారి పట్ల కూటమి ప్రభుత్వం ఇంత మెతక వైఖరితో వ్యవహరిస్తుండటంపై టీడీపి నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేశారు కూడా.
కానీ కూటమి ప్రభుత్వం వారినీ పట్టించుకోకపోవడంతో వారు కూడా నిరాశతో సైలంట్ అయిపోయారు. మరోపక్క ఈ మెతక వైఖరి చూసి జగన్తో సహా వైసీపీ నేతలు మళ్ళీ రెచ్చిపోతున్నారు.
అమరావతి పేరుతో సిఎం చంద్రబాబు నాయుడు భారీగా అవినీతికి పాల్పడుతున్నారని, అమరావతి కోసం అప్పులు చేసేస్తూ మొత్తం డబ్బంతా అక్కడే ఖర్చు చేసేస్తున్నారని, అమరావతి కోసం మిగిలిన జిల్లాలకు అన్యాయం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం జోరుగా సాగుతోంది.
జగన్ పరామర్శకు బయలుదేరిన ప్రతీసారి బలప్రదర్శనలు చేస్తూనే ఉన్నారు. అడ్డుకునే ప్రయత్నం చేస్తే తాను సిఎం అయిన తర్వాత పోలీస్ అధికారులను గుడ్డలూడదీసి రోడ్లపై నిలబెడతానని బెదిరిస్తున్నారు.
ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేయదు కనుక జగన్ని చూసి వైసీపీ కార్యకర్తలు రప్పా రప్పా అంటూ మరింత రెచ్చిపోతూనే ఉన్నారు.
వైసీపీ ఇంతగా రెచ్చిపోతున్నా కూటమి ప్రభుత్వం అవేమీ పట్టన్నట్లు అభివృద్ధి పనులు, పరిశ్రమలు, పెట్టుబడుల మీదే దృష్టి పెట్టి పనిచేసుకుపోతోంది.
కానీ జగన్ తాజా ప్రెస్మీట్లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో టీడీపిలో అందరూ బటన్ నొక్కినట్లు ఒకేసారి యాక్టివ్ అయ్యారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు పోటాపోటీగా జగన్కి కౌంటర్లు ఇస్తున్నారు. టీడీపి నేతలు ఇంతగా రియాక్ట్ అవుతారని ఊహించని వైసీపీ, దాని సొంత మీడియా, సోషల్ మీడియా కంగు తిన్నట్లే ఉంది.
కూటమి ప్రభుత్వం వైసీపీ జోలికి రానప్పుడు ఆ పార్టీ అధినేత దానిని అలుసుగా చాతకానితనంగా భావిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారు. కానీ కూటమి ప్రభుత్వం ధీటుగా స్పందిస్తే ప్రశ్నించే గొంతుకలని అణచివేస్తున్నారంటూ కొత్త పల్లవి అందుకుంటారు.
అదే… వైసీపీ ప్రజాసమస్యల పరిష్కారం కోసం పోరాడితే వారికే గౌరవమర్యాదలు లభించేవి. కూటమి ప్రభుత్వం కూడా తగిన విధంగా స్పందిస్తూ ఉండేది కనుక రాష్ట్రంలో ఆరోగ్యకరమైన రాజకీయ వాతావరణం నెలకొని ఉండేది కదా?




