చిరంజీవి-వెంకటేష్, వెంకటేష్-మహేష్ బాబు, రామ్ చరణ్-జూ.ఎన్టీఆర్ వంటి అగ్ర నటులు కాంబినేషన్లో సినిమా అంటే భారీగా అంచనాలు ఉంటాయి. అవి అలాగే హిట్ అవుతుంటాయి కూడా.
అటువంటి అరుదైన కాంబినేషనే ఏపీలో చంద్రబాబు నాయుడు-పవన్ కళ్యాణ్-నారా లోకేష్లది కూడా. అగ్రనటుల సినిమాలపై భారీ అంచనాలున్నట్లే, వీరి కూటమిపై కూడా చాలా భారీ అంచనాలు ఏర్పడాయి.
గమ్మతేమిటంటే వారి కాంబినేషన్పై వారి పార్టీ నేతలకు, శ్రేణులకు, చివరికి చాలా మంది ప్రజలలో కూడా నిన్న మొన్నటి వరకు అనుమానంగానే ఉండేది.
కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక్కరికే వారిది ‘డెడ్లీ కాంబినేషన్’ అని గట్టిగా నమ్మారు. ఆయన నమ్మకం వమ్ము కాలేదు. వారిది ‘డెడ్లీ కాంబినేషన్’ అని అందరి కంటే ముందు పసిగట్టిన జగన్ దానిని బ్రేక్ చేయడానికి 18 నెలలుగా చేయని ప్రయత్నం లేదు. కానీ ఏవీ ఫలించడం లేదు. పైగా ఆయన ప్రయత్నించిన కొద్దీ వారి బంధం ‘మహా సిమెంట్’తో కట్టిన గోడలా మరింత బలపడుతోంది!
సాధారణంగా ఏ ప్రభుత్వంలోనైనా అత్యంత కీలకపాత్ర నిర్వహిస్తున్న కీలక నేతల మద్య ‘ఇగో క్లాష్’లు ఏర్పడుతుంటాయి. వాటితో చిన్నగా అగ్గి రాజుకొని ప్రభుత్వాలు కూలిపోయే ప్రమాదం ఏర్పడుతుంటుంది.
ఉదాహరణకు కర్ణాటకలో సిఎం, డెప్యూటీ సిఎంల మద్య, తెలంగాణలో మంత్రుల మద్య ఇలాంటి ‘ఇగో క్లాష్’లు ఏర్పడితే పరిస్థితి చెయ్యి జారిపోతుంటుంది. వెంటనే వారి అధిష్టానం ‘డ్యామేజ్ కంట్రోల్’ చేస్తుంటుంది.
కానీ కూటమి ప్రభుత్వంలో ముగ్గురు త్రిమూర్తులు ఒకరిపట్ల ఒకరు ఎంతో గౌరవంగా, ఆప్యాయంగా వ్యవహరిస్తుండటం చూసి ప్రజలు కూడా చాలా సంతోషిస్తున్నారు. గీత గీసుకున్నట్లు ఎవరి పరిధిలో వారుంటూనే అన్నదమ్ముల్లా కలిసి మెలిసి పనిచేస్తున్నారు.
కాస్త కష్టపడితే ‘డెడ్లీ కాంబినేషన్’ సెట్ చేయవచ్చు. కానీ నేతల ఇగోలు, పార్టీలో అంతర్గత ఒత్తిళ్ళు, వైసీపీ ప్రయత్నాల మద్య ఈ కాంబినేషన్ ఇంత చక్కగా మెయిన్టెయిన్ చేయడం కత్తి మీద సాము వంటిదే.
ఈ కాంబినేషన్ కేవలం 5 ఏళ్ళకే పరిమితం కాదు. మరో 15 ఏళ్ళు ఉంటుందంటూ, ఇటీవల మంత్రి నారా లోకేష్ చెప్పారు.
బూత్ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో “మన మూడు పార్టీల మద్య విడాకులు, క్రాస్ ఫైరింగ్, మిస్ ఫైరింగ్లు ఉండవు. ఏవైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుంటున్నాము. మరో 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. ఉండటం చాల అవసరం కూడా,” అని అన్నారు.
కత్తి మీద సాముచేయడం ఎలాగో త్రిమూర్తులు బాగా నేర్చుకున్నారు. కనుక తమ ఐఖ్యతకి, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నవారిని నిర్దాక్షిణ్యంగా ఏరి పారేయడం కూడా చాలా అవసరం.
ఉదాహరణకు కాళేశ్వరం గురించి రెండు ముక్కలు చెప్పుకోవాలి. లక్ష కోట్లు ఖర్చు చేసి కట్టిన ఆ ప్రాజెక్టులో మూడు పిల్లర్లు క్రుంగిపోయాయి. దాని దిగువన ఉండే రెండు మూడు బ్యారేజీల గోడలు బీటలు వారాయి. ఆ చిన్న చిన్న పగుళ్ళే లక్ష కోట్ల ప్రాజెక్టుకి ప్రమాదకరంగా మారాయి. అంత ‘నభూతో నభవిష్యత్ ప్రాజెక్టు’ని నిరుపయోగంగా మార్చేశాయి.
జగన్ సేనలు రప్పారప్పాలతో మళ్ళీ మేమే అని ఆంధ్రా ప్రజలకు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ‘భయం పరిచయం’ చేస్తున్నాయి. అదేవిధంగా త్రిమూర్తులు కూడా తమ కూటమి బలంగా ఉందని ప్రజలకు బాగా నమ్మకం కలిగించడం చాలా అవసరం. అదే చేస్తున్నారు కూడా.
వారి ఐఖ్యత, బలంపైనే కూటమి విజయం ఆధారపడి ఉంటుంది. కానీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చెప్తున్నట్లు కూటమి కంచుకోట 15 ఏళ్ళు చెక్కుచెదరకుండా ఉండాలంటే దానిని బీటలు వారేలా చేస్తున్నవారిని ఎప్పటికప్పుడు గుర్తిస్తూ నిర్దాక్షిణ్యంగా ఏరిపారేయాలి.






