‘సాక్షి’ పిచ్చి రాతలపై చంద్రబాబు విప్పిన ‘లెక్కలు’

Chandrababu released land transactions detailsనవ్యాంధ్ర రాజధాని అమరావతిలో భూములపై జగన్ పత్రిక ‘సాక్షి’లో గత నాలుగైదు రోజులుగా పిచ్చి రాతలు రాస్తూ, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో జరిగిన భూ లావాదేవీల వివరాలను ఆయన మీడియా ముందు ఉంచుతూ, రాజధాని ప్రాంతం కావడంతో సొంతిల్లు ఉండాలని, కొంత భూమిని కొనాలని ఎవరు మాత్రం భావించరు? అంటూ మొత్తం జరిగిన లెక్కల వివరాలను ప్రజల ముందుంచారు.

రాజధాని ప్రాంతంలో 20,306 లావాదేవీలు జరిగాయని, మొత్తం 9,231 ఎకరాలు చేతులు మారాయని, వీటిల్లో బహుళ లావాదేవీలు కూడా ఉన్నాయని, ఇళ్ల స్థలాల కోసం 7,942 మంది 418 ఎకరాలు కొనుగోలు చేశారని స్పష్టం చేశారు. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి టాప్ -100 లావాదేవీలను పరిశీలిస్తే, అత్యధికంగా 7.5 ఎకరాలు చేతులు మారిందని, 100వ లావాదేవీ 2.70 ఎకరాలని, ఈ 100 లావాదేవీల్లో భాగంగా 365.662 ఎకరాలు చేతులు మారాయని తెలిపారు. ఇదేమైనా నేరమా? అంటూ ప్రశ్నించారు.

ADVERTISEMENT

రైతులు అమ్ముకున్న భూమి 1,724 ఎకరాలను వెల్లడించిన చంద్రబాబు, జగన్ పత్రిక ఓ పద్ధతి ప్రకారం బురద జల్లుతోందని దుయ్యబట్టారు. రాజధాని ప్రాంతం ఎక్కడన్న విషయం వెల్లడికాక ముందు దొనకొండ, నూజివీడు, తిరుపతి, నందిగామ వంటి ప్రాంతాల్లోనూ భూ లావాదేవీలు జరిగాయని తెలిపారు. వైకాపా నేత అవినాష్ రెడ్డి మామ దొనకొండలో బలవంతంగా భూములు ఆక్రమించాడన్న కేసు నమోదైందని, అక్కడ జరిగిన ఓ హత్య కేసులో ఆయన పేరుందని గుర్తు చేశారు. ఈ ప్రాంతాల్లో కొనుగోలు చేసిన వారు నష్టపోయారని చంద్రబాబు వివరించారు.

తన కుమారుడు లోకేష్ 425 కోట్ల విలువైన హాయ్ ల్యాండ్ భూమిని కొన్నాడని ఆరోపించడం అత్యంత దుర్మార్గమైన విషయమని అన్న చంద్రబాబు, జప్తులో ఉన్న భూములు ఎలా కొంటారన్న విషయం కూడా ‘సాక్షి’ పత్రికకు తెలియకపోవడం దురదృష్టకరమని అన్నారు. ‘గుడ్డ కాల్చి ముఖాన వేసి తుడుచుకోమని అనడం భావ్యమా? సాక్షినే కాదు… వార్తలు రాసిన, చూపిన మీడియాను అడుగుతున్నా… తప్పుడు ఆరోపణలు చేస్తూ, పబ్బం గడుపుకోవాలని అనుకోవడం తుచ్ఛం” అన్నారు.

భూములను కొనుగోలు చేసిన మంత్రులు వాటిని వెనక్కి రాసిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, వారికి భూములు అమ్మిన ఏ రైతు అడిగినా వారు ఇచ్చేస్తారని అన్నారు. రాజధాని ప్రాంతంలో కొంత భూమిని కలిగి వుంటే మంచిదని భావించి, ఒకటో, రెండో ఎకరాలను కొనుగోలు చేస్తే, వేలాది ఎకరాలను బలవంతంగా లాక్కున్నారని ఆరోపించిన జగన్ అందుకు సాక్ష్యాలుంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ల్యాండ్ పూలింగ్ లో ఎలాంటి అవకతవకలూ జరగలేదని తాను నిర్భయంగా చెప్పగలనని, ఆధారాలు చూపితే కచ్చితంగా చర్యలు తీసుకుంటానని అన్నారు.

ADVERTISEMENT
Latest Stories