ఎంతో ప్రతిష్టాత్మకంగా విజయవాడ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభమైన ‘మినీ ధియేటర్’లో మొదటి షో కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకంగా 1200 రూపాయలు పెట్టి టికెట్లు కొనుగోలు చేసారు. అయితే ఇంత మొత్తం వెచ్చించి, ఇంతకీ ఏ సినిమా చూసారంటే… గతేడాది టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొట్టిన ‘శ్రీమంతుడు’ సినిమా!
ఆ సినిమా విడుదలైన సమయంలోనే ‘శ్రీమంతుడు’ను చూసిన చంద్రబాబు, మరోసారి ‘వై స్క్రీన్’ ప్రారంభం సందర్భంగా వీక్షించారు. దేశంలోనే ఆర్టీసీ బస్టాండ్ లో తొలి థియేటర్ గా రికార్డులకు ఎక్కిన ‘వై స్క్రీన్’లో తొలి తాంబూలం మహేష్ బాబు ‘శ్రీమంతుడు’కు దక్కింది. మొత్తం సినిమాను వీక్షించడానికి సమయం లేకపోయినా, కాసేపు చూసిన తర్వాత అమరావతికి పయనమయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, శిద్ధా రాఘవరావు, అధికారుల టికెట్లు కూడా చంద్రబాబు నాయుడే కొనుగోలు చేసారు.



