ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ‘బుక్ మై ఆఫర్’పై అత్యధికంగా 449 ఫిర్యాదులు అందినట్లు వినియోగదారుల వ్యవహారాల సహాయమంత్రి సీఆర్ చౌధురి పేర్కొన్నారు. లోక్ సభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఇందుకు సంబంధించిన వివరాలను సమర్పించారు. గత ఏడాది డిసెంబర్ వరకు అందిన ఫిర్యాదులకు సంబంధించిన వివరాలను ఇందులో పొందుపరిచారు.
జాతీయ వినియోగదారుల హెల్ప్ లైన్ సమాచారం మేరకు మొత్తం 1386 ఫిర్యాదులు ఆయా సంస్థలపై అందాయని, అందులో అత్యధికంగా ‘బుక్ మై ఆఫర్. కామ్’ అనే వెబ్ సైట్ పై వచ్చాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఈబే -135, స్నాప్ డీల్ – 120, అమెజాన్.ఇన్ – 114, ఫ్లిప్ కార్ట్ – 92, వాకీ.కామ్ – 79, షాప్ క్లూస్ – 47, పేటీఎంపై 46 ఫిర్యాదులు, ఇంకా వివిధ ఈ-కామర్స్ సంస్థలపై ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు.
అయితే ఈ-కామర్స్ వెబ్ సైట్లకు సంబంధించి కొత్తగా నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసే ఉద్దేశమేదీ లేదని ఈ సందర్భంగా సీఆర్ చౌధురి పేర్కొన్నారు. ప్రస్తుతం ఇండియాలో ఆన్ లైన్ విధానంలో కొనుగోలు శక్తి పెరగడంతో, వినియోగదారుల నుండి వెలువడే ఫిర్యాదులు కూడా ప్రామాణికంగా మారాయి. ఆయా ఈ-కామర్స్ దిగ్గజాల నాణ్యతకు నిదర్శనంగా సదరు ఫిర్యాదుల సంఖ్య నిలుస్తోంది.



