ఇటీవల ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చైనాలో జరిపిన పర్యటన సానుకూల ఫలితాల దిశగా మారుతోంది. మంత్రులు, అధికారుల బృందంతో కలిసి ఏకంగా ఐదు రోజులు పర్యటించి, పలు ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలతో చర్చలు జరిపారు. ఇందులో భాగంగా, అక్కడే పలు సంస్థలతో ఎంవోయులు చేసుకోగా, ఏపీలో ఉన్న అవకాశాలను ఉదహరిస్తూ మరికొన్ని సంస్థలకు ప్రతిపాదనలు చేసి వచ్చారు. అలాంటి ప్రతిపాదనలలో తాజాగా ఓ చైనా సంస్థ నుండి సుముఖత వచ్చింది.
ఏపీలోనూ హైస్పీడ్ డ్రాగన్ రైళ్లను నడపాలని చైనా రైల్వే కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్ (సీఆర్సీసీ) అధికారులతో చంద్రబాబు చేసిన ప్రతిపాదనలకు, సదరు సంస్థ అధికారుల నుండి సానుకూల స్పందన వ్యక్తమైంది. ఏపీలో తమ హైస్పీడ్ రైళ్లను నడిపేందుకు సిద్ధంగానే ఉన్నట్లు ఈ మేరకు త్వరలోనే విజయవాడకు రానున్నట్లు సీఆర్సీసీ అధికారులు ఏపీ సర్కార్ కు సమాచారం పంపారు. దీంతో మరో కీలక ప్రాజెక్ట్ ఏపీకి దక్కే అవకాశం ఉందంటూ అధికార వర్గాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి.



