అయ్యన్న వద్దని చెపుతున్నా ఎందుకు వినరో?

Chintakayala-Ayyanna-Patrudu TDP

ఒకప్పుడు కార్యకర్తలలో నాయకత్వ లక్షణాలున్నవారు ఆయా పార్టీలలో నాయకులుగా ఎదిగేవారు. కానీ ఇప్పుడు ఏ పార్టీకి అంత ఓపిక, సమయం ఉండటం లేదు. కనుక ఇతర పార్టీలలో నుంచి రెడీమేడ్ నాయకులను దిగుమతి చేసుకొని వారితోనే పార్టీలను బలోపేతం చేసుకుంటున్నాయి.

ADVERTISEMENT

దీని వలన అన్ని పార్టీలలో అన్ని పార్టీల నాయకులు కనబడుతుంటారు. ముఖ్యంగా అధికారపార్టీలో ఎక్కువ కనబడుతుంటారు. ఇటువంటి అవకాశవాద నాయకుల వలన పార్టీలు తాత్కాలికంగా బలోపేతం అయిన్నట్లు కనిపించినా, వారు మళ్ళీ పార్టీ మారినప్పుడు జరిగే నష్టం అంతా ఇంత కాదు.

కనుక ఉన్నవారితోనే చక్కగా పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించుకుందామని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సలహా ఇచ్చారు. కానీ టీడీపీ, జనసేనలలోకి వైసీపీ నాయకులు వచ్చి చేరుతూనే ఉన్నారు. కనుక బీజేపి మడి కట్టుకు కూర్చుంటుందని ఆశించలేము కదా? కనుక ఏపీ బీజేపి అధ్యక్షురాలు పురందేశ్వరి విశాఖ డెయిరీ ఛైర్మన్‌ ఆడారి ఆనంద్ కుమార్‌, కుటుంబ సభ్యులకు పార్టీ కండువాలు కప్పి బీజేపిలో చేర్చుకున్నారు.

ఆడారి ఆనంద్ కుమార్‌ మొదట టీడీపీలోనే చేరాలనుకున్నారు. కానీ టీడీపీ నేతలు అంగీకరించకపోవడంతో జనసేనకు వెళ్దామనుకున్నారు. కానీ ఆ పార్టీలో కూడా వ్యతిరేకత ఎదురవడంతో బీజేపిలో చేరిపోయారు. అంటే చుట్టూ తిరిగి కూటమిలోకి వచ్చేశారన్న మాట!

విశాఖ డెయిరీలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపేందుకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు సభా సంఘాన్ని నియమించారు. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆడారి ఆనంద్ ఇప్పుడు కూటమిలోనే రాజకీయ ఆశ్రయం పొందారు! కనుక ఆయనపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోగలదా? తీసుకునేందుకు బీజేపి అంగీకరిస్తుందా?అంటే కాదనే అర్దమవుతోంది.

టీడీపీ, జనసేనలు ఎవరితోనైతే ఇంతకాలం పోరాటాలు చేశాయో వారినే అక్కున చేర్చుకొని వారి అవినీతి అక్రమాలను ఉపేక్షిస్తుంటే ప్రజలకు ఎటువంటి సందేశం వెళుతుందో ఆలోచించుకుంటే బాగుంటుంది. టీడీపీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన అయ్యన్న పాత్రుడు కంటే పార్టీ మేలు కోరేవారు ఎవరుంటారు? కనుక ఆయన సలహాలు, సూచనలు పాటించి వైసీపీ నేతలను దూరంగా ఉంచడమే మంచిది.

ADVERTISEMENT
Latest Stories